ఆ వ్యక్తి పొట్టకూటి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ ఏవో పనులు చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. అయితే అతని కష్టాలు చూసిన లక్ష్మీ దేవీ అతనిపై కృప చూపింది. సరదా కోసం కొనుగోలు చేసిన లాటరీ టికెట్టు తనకు తాకేలా చేసింది. ఇంకేంటి అప్పటి వరకూ కష్టాలు పడుతూ కాలం వెళ్లదీస్తున్న వ్యక్తి.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.
భారత్కు చెందిన మురుగనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం పొట్టకూటి కోసం యూఏఈ వెళ్లారు. అక్కడ వివిధ పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓఘటన అతని జీవితాన్నే మార్చి వేసింది. అతని స్నేహితునితో కలిసి యూఏఈ లాటరీ వైబ్సైట్లో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా జరిగిన లక్కీ డ్రాలో ఆ టికెట్ రెండవ బహుమతి గెలుచుకుంది. దీంతో అతనికి 50 లక్షల దిర్హామ్లు భారత కరెన్సీలో దాదాపు రూ.11.35 కోట్లు ఆయన సొంతమయ్యాయి.
ఈ లాటరీ దక్కడంపై మురుగనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను కొన్న తొలిటికెట్ కే లాటరీ తాకడం సంతోషంగా ఉందన్నారు. తన ఆర్థిక కష్టాలు పరిష్కారిద్దామని ఇక్కడికి వస్తే దేవుడు తనను ఇంత త్వరగా కరుణించాడని ఆనందం వ్యక్తం చేశారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని ఈ డబ్బులతో ఇప్పుడు తన కుటుంబం స్థిరపడుతుందన్నారు. తన స్నేహితునితో కలిసి ఈ టికెట్ కొనుగోలు చేశానని వచ్చే డబ్బులని ఇద్దరం సమానంగా పంచుకుంటామని తెలిపారు. కాగా ఈ లాటరీలో తొలి ఫ్రైజ్ 30 మిలియన్ దిర్హామ్లు.


