ఆయనో హైకోర్టు న్యాయమూర్తి. ఉన్నత న్యాయస్థానం జడ్జిగా ఐదేళ్ల పాటు నిరాటంకంగా తీర్పులు కూడా ఇచ్చేశారు. తీరా చూస్తే ఆయన నకిలీ లా డిగ్రీతో పదవిలోకి వచ్చారని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా.. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకున్నారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించి ఇంటికి పంపించారు. ఈ ఘటన పాకిస్థాన్లో వెలుగులోకి వచ్చింది.
డాన్ పత్రిక కథనం ప్రకారం.. జస్టిస్ తారిఖ్ మహమూద్ జహంగిరి ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2020, డిసెంబర్లో ఆయన హైకోర్టు జడ్జి అయ్యారు. అయితే నకిలీ డిగ్రీ వ్యవహారం బయటపడడంతో ఆయనను గతేడాది సెప్టెంబర్లో న్యాయమూర్తి పదవి నుంచి తప్పించారు. జస్టిస్ జహంగిరిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం (ఫిబ్రవరి 23) ఆయనకు వ్యతిరేకంగా 16 పేజీల తీర్పు వెలువరించింది. నకిలీ డిగ్రీతో మోసానికి పాల్పడడమే కాకుండా, శిక్ష పడకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారని న్యాయస్థానం ధ్రువీకరించింది.
కరాచీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అందించిన అసలు రికార్డుల ఆధారంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. జహంగిరి 1988లో నకిలీ నమోదు సంఖ్యను ఉపయోగించి లా పరీక్షకు హాజరైయ్యాడు. మరుసటి ఏడాది అంటే 1989లో పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడడంతో కరాచీ యూనివర్సిటీ ఆయనపై మూడేళ్ల నిషేధం విధించింది. అయినా అతడి బుద్ధి మారలేదు. ఇంతియాజ్ అహ్మద్ అనే విద్యార్థికి కేటాయించిన ఎన్రోల్మెంట్ నంబర్తో మళ్లీ పరీక్షకు హాజరయ్యాడు. మరోవైపు జహంగిరి తమ కాలేజీలో చదవలేదని ప్రభుత్వ ఇస్లామియా లా కాలేజీ ప్రిన్సిపాల్ కోర్టుకు తెలిపారు.
కాగా, ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని, రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఏవేవో సాకులు చెప్పి స్పందించలేదని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. లా డిగ్రీకి సంబంధించిన అసలు ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వెలువరించింది.
చదవండి: మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. అక్కసుతో పాకిస్థాన్ తీర్మానం


