నైజీరియా ట్విట్టర్​ బ్యాన్.. దెబ్బ కూడా నైజీరియాకే!

Twitter Ban Will Effect Nigeria As Tech Investments Back - Sakshi

అబూజా: ఆఫ్రికన్​ కంట్రీ నైజీరియా.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​ను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అధ్యక్షుడు బుహారీ ట్వీట్​ను తొలగించిన కారణంగానే ట్విట్టర్​ కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నైజీరియా నిర్ణయంపై సొంత ప్రజలు అంసతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. అయితే ఇది అసలు కారణం కాదనే వాదన ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
నిజానికి ట్విట్టర్​పై నైజీరియా సర్కార్ గుర్రుగా ఉంది అధ్యక్షుడి ట్వీట్ డిలీట్​ వ్యవహారంతో మాత్రమే కాదని ఆ వాదన సారాంశం. గత కొన్నేళ్లుగా నైజీరియాలోని లాగోస్​ ఆఫ్రికాలోనే అత్యంత ఆకర్షణనీయమైన టెక్​ హబ్​గా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏప్రిల్​లో ట్విట్టర్​ ఆఫ్రికాలో తన రీజినల్ హెడ్​క్వార్టర్​ కోసం లాగోస్ కాకుండా.. ఘనాను ఎంచుకుంది. దీనిపై నైజీరియా వివరణ కోరగా.. ఘనా ప్రభుత్వం బయటి పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుందని ట్విట్టర్​ కారణం చెప్పింది. నిజానికి ట్విట్టర్​ వివరణను సమర్థించడానికి బోలెడు కారణాలున్నాయి. అయినప్పటికీ నైజీరియా ఆ విషయంలో దారుణంగా హర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్​ డిలీట్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. 

దెబ్బ నైజీరియాకే!
ఇక ట్విట్టర్​ బ్యాన్​ వివాదంతో నైజీరియా టెక్ రంగం సంక్షోభంలో పడే అవకాశం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఇరవై కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియాలో స్మార్ట్​ ఫోన్​ యూజర్ల శాతం 60కి పైనే ఉంది. మరోవైపు టెక్​ పెట్టుబడులతో లాగోస్​ ఆర్థికాభివృద్ధికి బీజం వేసింది. ఆఫ్రికాకే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా అవతరించింది. ఇలాంటి తరుణంలో నైజీరియా ట్విట్టర్​ బ్యాన్​ నిర్ణయంతో.. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016లో నైజీరియా టూర్​లో మార్క్​ జుకర్​బర్గ్​ ఫేస్​బుక్​ ఆఫీస్​ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. 2021 ద్వితియార్థంలో అది జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేస్​బుక్​ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల తర్వాత నైజీరియా ప్రతినిధులు ఫేస్​బుక్​ హెడ్​ క్వార్టర్స్​కు సందేశం పంపగా.. అక్కడి నుంచి బదులు లేకపోవడంతో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. ఇక ఇదే బాటలో మరికొన్ని టెక్​ సంస్థలు లాగోస్​ నుంచి వెనక్కి వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నైజీరియా దూకుడు నిర్ణయం వల్ల 170 మిలియన్​ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం నెలకొన్నట్లు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top