ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని కలవాలని ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్.. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తాను ఇరాన్ సుప్రీం లీడర్ను నేరుగా కలవాలనుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో ఖమేనీ భాగస్వామి అయ్యారని.. ఇరువురి మధ్య సంబంధాలు చాలా బాగున్నట్లు కనిపిస్తోందంటూ ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రజలు, నాయకులకు ఆయనపై చాలా గౌరవం ఉందని నేను భావిస్తున్నాను.. అలాగే ఏదో ఒక సమయంలో తాను ఆయనను కలవాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.
'పాడ్ ఫోర్స్ వన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పరిణామాలు ఎలా సాగుతాయనే దాన్ని బట్టి.. మేము ఏదో ఒక సమయంలో సమావేశమవుతామని చెప్పారు. ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనే విషయానికి అంగీకరించిందని.. అది చాలా పెద్ద విషయం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
"మేము వారిని అణు ఆయుధాన్ని కలిగి ఉండనివ్వలేము. వారు అణు ఆయుధాన్ని కలిగి ఉండబోమని ఇప్పటికే అంగీకరించారు. వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల్లో జాప్యం ఉన్నప్పటికీ ఇరాన్తో తమ మంచి సంబంధాల దిశగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ గతంలో మొజ్తబా ఖమేనీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాత్రం ఆయనతో నేరుగా చర్చలకు సిద్ధమంటూ సానుకూల ధోరణితో మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


