అమెరికా దుశ్చర్య! | Three Indian seafarers were killed in US military strikes against oil tankers | Sakshi
Sakshi News home page

అమెరికా దుశ్చర్య!

Jun 12 2026 4:25 AM | Updated on Jun 12 2026 6:30 AM

Three Indian seafarers were killed in US military strikes against oil tankers

భారత సిబ్బంది ఉన్న మూడు నౌకలపై దాడులు

ఒమన్‌ సమీప సెటెబె చమురునౌకపై దాడి ఘటనలో ముగ్గురు భారతీయుల దుర్మరణం 

మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌ వాసి 

దాడులను తీవ్రంగా ఖండించిన భారత్‌ 

ఎంటీ జల్‌వీర్‌ నౌక మీదా దాడి 

అందులోని 20 మంది భారతీయులు సురక్షితం

దుబాయ్‌/న్యూఢిల్లీ/విశాఖపట్నం/ఐరాస: ఇరాన్‌పై ముమ్మర దాడులకు తెగించిన అమెరికా బుధవారం ఒమన్‌ సమీప హార్మూజ్‌ జలసంధి సముద్రజలాల్లోని ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌ వాసిగా గుర్తించారు. వరసబెట్టి భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్యనౌకలపై అమెరికా దాడులు చేయడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. 

అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛావాణిజ్యానికి భంగం కల్గించేలా కాల్పులు జరపడం చట్టవ్యతిరేకమని భారత్‌ పునరుద్ఘాటించింది. తక్షణం కాల్పుల పర్వానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భారత్‌ సూచించింది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డిఅఫైర్స్‌ జేసన్‌ను పిలిపించి భారత్‌ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.  

మృతదేహాల స్వా«దీనం 
ఎంటీ సెటెబె నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు బుధవారం వార్తలొచ్చాయి. అయితే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని, వాళ్ల మృతదేహాలను స్వా«దీనంచేసుకున్నామని భారత నౌకాయాన మంత్రి శర్బానంద సోనోవాల్‌ గురువారం ప్రకటించారు. వాళ్ల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. 

మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ అన్నివేళలా అండగా ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. సెటెబెపై దాడిలో మిగతా 21 మంది భారతీయ సిబ్బందిని ఒమన్‌ తీరగస్తీ బలగాలు కాపాడాయని మంత్రి వెల్లడించారు. 24 మంది భారతీయ సిబ్బంది ఉన్న మరో చమురు రవాణా నౌక మారీవెక్స్‌పై అమెరికా దాడిలో మొత్తం 24 మందినీ కాపాడటం తెల్సిందే. 

మూడో నౌక మీదా దాడి 
భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులపర్వం గురువారమూ కొనసాగింది. ఒమన్‌లోని షినాస్‌ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్‌వీర్‌ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్‌ఫైర్‌ గైడెడ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఇవి నౌక ఇంజిన్‌ రూమ్‌ను నాశనం చేశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. 

ఒమన్‌ రాయల్‌ నేవీ దళాల సాయంతో నౌకలోని 22 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తీసుకొస్తున్నామని మస్కట్‌ నగరంలోని భారతీయ రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’లో స్పష్టంచేసింది. గత నాలుగు రోజుల వ్యవధిలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిసీ దాడిచేశామని అమెరికా గురువారం తొలిసారిగా ఒప్పుకుంది. ‘‘ఎంటీ జల్‌వీర్‌ ఇరాన్‌ చమురును అనుమతిలేకుండా గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ గుండా తరలిస్తోంది. దిశ మార్చుకోవాలని పదేపదే హెచ్చరించినా బేఖాతరు చేశారు. అందుకే నౌకపై దాడిచేశాం’’అని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తన చర్యను సమర్థించుకుంది.  
 
2 వారాల్లో 15వ వివాహ వార్షికోత్సవం 
అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వ్యక్తి 44 ఏళ్ల పటా్నల సురేశ్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని ఢిల్లీలోని ఆంధ్రభవన్‌ గురువారం ప్రకటించింది. భార్య భార్గవితో కలిసి జూన్‌ 24వ తేదీన 15వ వివాహ వార్షికోత్సంకోసం స్వస్థలానికి వచ్చేందుకు సురేశ్‌ అధికారుల అనుమతి తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో సురేశ్‌ మృతి వార్త తెలిసి అతని కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. ఆయనకు 12, 10 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మరణించాడన్న వార్త తెలిసి పిల్లలిద్దరూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘గత ఐదు నెలలుగా సముద్రంలో విధినిర్వహణలో ఉండిపోయారు. మ్యారేజ్‌డే కోసం త్వరలో ఇంటికొస్తున్నా అని చెప్పారు. కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మెరైన్‌ ఇంజనీరింగ్‌ను ఆయన వృత్తిలా భావించరు. ఎంతో తపనతో పనిచేస్తారు’’అని భార్య భార్గవి వాపోయారు.

ఐరాస వేదికగా భారత్‌ నిరసన 
అమెరికా దాడి సంస్కృతిపై భారత్‌ ఐక్యరాజ్యసమితి వేదికగా ధ్వజమెత్తింది. ఏకపక్ష దాడులను తక్షణం నిలిపేయాలని డిమాండ్‌చేసింది. ఐరాస భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి,భద్రత: మధ్యవర్తిత్వం ద్వారా పశ్చిమాసియా సమస్యకు పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారతరాయబార శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ మాట్లాడారు. ‘‘పశ్చిమాసియా దేశాలపై దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరుగుతున్నాయి. సముద్రగర్భ కేబుళ్లూ ధ్వంసమవుతున్నాయి. పశ్చిమాసియాలో సుస్థిరత కొనసాగాలంటే వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు అస్సలు తెగిపోకూడదు. అగ్రరాజ్యం(అమెరికా) దాడులు ఆపాల్సిందే’’అని హరీశ్‌ గట్టిగా డిమాండ్‌చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement