కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్‌  | Nobel Prize 2025 in Chemistry Awarded for Metal–Organic Frameworks (MOFs) Discovery | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్‌ 

Oct 8 2025 3:33 PM | Updated on Oct 9 2025 5:46 AM

Susumu Kitagawa Prize in Chemistry 2025

రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటన  

మెటల్‌–ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ అభివృద్ధికి గుర్తింపు   

స్టాక్‌హోమ్‌: లోహ సేంద్రియ చట్రాలను(మెటల్‌–ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌) అభివృద్ధి చేసినందుకు రసాయన శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ బహుమతి లభించింది. నూతన రూపంలో మాలిక్యులర్‌ ఆర్కిటెక్చర్‌ను వారు రూపొందించారు. 2025 సంవత్సరానికి గాను సుసుము కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్, ఒమర్‌ ఎం.యాఘీలకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతి అందజేయనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సెక్రెటరీ జనరల్‌ హన్స్‌ ఎలెగ్రెన్‌ బుధవారం స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రకటించారు. 

కిటాగవా(74) జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, రాబ్సన్‌(88) ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్, యాఘీ(60) అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోరి్నయాలో పనిచేస్తున్నారు. ముగ్గురు శాస్త్రవేత్తలు భారీ కుహరాలతో కూడిన మాలిక్యులర్‌ నిర్మాణాలను సృష్టించారని, వీటిద్వారా కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్‌ వంటి వాయువులు స్వేచ్ఛగా లోపలికి, బయటకు ప్రవహిస్తాయని నోబెల్‌ కమిటీ వెల్లడించింది. 

ఈ మాలిక్యులర్‌ నిర్మాణాలు, లోహ సేంద్రియ చట్రాలు ఎడారిలో గాలి నుంచి నీటిని సేకరించడానికి, కార్బన్‌ డయాక్సైడ్‌ను సంగ్రహించడానికి, విషపూరిత వాయువులు లేదా ఉ్రత్పేరక రసాయన ప్రతిచర్యలను నిల్వ చేయడానికి తోడ్పడుతాయని తెలియజేసింది. ముగ్గురు సైంటిస్టులు వేర్వేరుగానే పనిచేశారు. 

స్థిరమైన మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ అభివృద్ధికి ఈ ముగ్గురి కృషి దోహదపడింది. 1989 నుంచి వారి పరిశోధనలు కొనసాగుతున్నాయి.    మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ ఇంటి నిర్మాణంలో కలప చట్రంతో పోల్చవచ్చు. ఈ నిర్మాణాలు వాయువులను లోపలికి పీల్చుకుంటాయి. అక్కడే నిల్వ చేసుకోగలవు. వాతావరణంలోని ప్రమాదకరమైన వాయువులను బంధించడానికి ఉపయోగపడగలవు. ఎడారుల్లో గాలి నుంచి నీటిని సులువుగా సంగ్రహించవచ్చు.   
 

ముగ్గురు సైంటిస్టులు తయారుచేసిన మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ను నోబెల్‌ కమిటీ సభ్యుడు ఓలాఫ్‌ రామ్‌్రస్టామ్‌ హ్యారీ పోటర్‌ సినిమాల్లోని హ్యాండ్‌బ్యాగ్‌తో పోల్చారు. ఈ సంచి పైకి చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, లోపల మాత్రం చాలా పెద్దది. 1901 నుంచి 2024 దాకా రసాయన శాస్త్రంలో 116 నోబెల్‌ ప్రైజ్‌లు ప్రకటించారు. 195 మంది సైంటిస్టులు ఈ బహుమతులు అందుకున్నారు.     

రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్


2024లో ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్‌ బేకర్, డెమిస్‌ హసాబిస్‌ జాన్‌ జంపర్‌కు ఉమ్మడిగా నోబెల్‌ లభించింది. 2025 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్‌ విజేత పేరును నోబెల్‌ కమిటీ గురువారం ప్రకటించనుంది. నోబెల్‌ శాంతి బహుమతి విజేత పేరును శుక్రవారం వెల్లడిస్తారు. ఆర్థిక శాస్త్రంలో విజేతను సోమవారం ప్రకటించబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 10వ తేదీన నోబెల్‌ బహుమతులు ప్రదానం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement