
టోక్యో: దాదాపు 42 మంది సిబ్బందితో పాటు దాదాపు 6వేల ఆవులను తీసుకొని న్యూజీలాండ్ నుంచి చైనాకు వెళ్తున్న నౌక మునిగిపోయింది. దక్షిణ జపాన్ ద్వీపానికి సమీపంలో గల్లంతైన ఈ నౌక కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. నౌకా సిబ్బందిలో ఒకరిని రక్షించినట్లు తెలుస్తోంది. జపాన్ పరిసరాల్లో ప్రస్తుతం టైఫూన్ మేసక్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ దెబ్బకు మునిగిన నౌకా సిబ్బంది బుధవారం ప్రమాద సంకేతాలను సమీప నౌకాశ్రయానికి పంపారు.
ఆ సమయంలో దక్షిణ చైనా సముద్రంలో నౌక పయనిస్తోంది. ప్రమాదసమయంలో నౌక తలకిందులైందని తర్వాత మునిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి వివరించారు. సిబ్బందిలో 38మంది ఫిలిప్పీన్స్కు ఇద్దరు న్యూజిలాండ్, ఇద్దరు ఆస్ట్రేలియాకు చెందిన సిబ్బంది ఉన్నారు. యూఏఈకి చెందిన గల్ఫ్ నావిగేషన్ హోల్డింగ్స్ సంస్థ ఈ నౌకకు సొంతదారు. ఆగస్టులో నౌక న్యూజిలాండ్ నుంచి బయలుదేరింది.