బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్‌ ప్రభుత్వమే: షేక్‌ హసీనా | Sheikh Hasina calls Muhammad Yunus mastermind of mass killings in Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో వరుస దాడులకు యూనస్‌ ప్రభుత్వమే కారణం: షేక్‌ హసీనా

Dec 3 2024 10:52 AM | Updated on Dec 3 2024 12:36 PM

Sheikh Hasina calls Muhammad Yunus mastermind of mass killings in Bangladesh

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్‌ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్‌ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద​ యూనస్‌. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్‌​ రెహమాన్‌(బీఎన్‌పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. 

దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్‌ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు’ షేక్‌ హసీనా ప్రశ్నించారు. 

ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. 

బంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్‌ ప్రతినిధి చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ఠ్‌తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.

అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్‌.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. 

కాగా బంగ్లాదేశ్‌ పరధానిగా ఉన్న షేక్‌ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్‌ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్‌ పోల్‌ సాయమూ కోరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement