
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు.
క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు.
ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు.
అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది.
మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి.
A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6
— Aima Khan (@aima_kh) June 27, 2025