పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్‌ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’ | Pannun assassination plot: us says looking forward to the results over Indias inquiry | Sakshi
Sakshi News home page

పన్నూ హత్యకు కుట్ర: ‘భారత్‌ దర్యాప్తు వివరాలపై ఎదురు చూస్తున్నాం’

Jun 27 2024 10:49 AM | Updated on Jun 27 2024 11:37 AM

Pannun assassination plot: us says looking forward to the results over Indias inquiry

న్యూయార్క్‌: ఖలీస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్‌ పన్నూ హత్య కుట్రలో భారత్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపణలు చేసింది. గత ఏడాది ఇదే అంశంపై అమెరికా సమాచారాన్ని పంపించగా దానిపై భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని తెలిపింది. 

ఇటీవల అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు పన్నూ హత్యకుట్రలో భారత్‌ ప్రమేయంపై దౌత్యపరమైన స్పందన కోరాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు. సెనేట్‌ సభ్యులు రాసిన లేఖపై మీడియా అడిగిన ప్రశ్నకు బుధవారం విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు.

‘ఎప్పటిలాగే ఆ సభ్యుల గురించి నేను ప్రైవేట్‌గా మాత్రమే స్పందిస్తాను. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయంపై ఏం వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. పన్నూ హత్య కుట్ర ముందుగా మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా భారత ప్రభుత్వానికి సమాచారం అందించాం. ఈ కేసులో భారత ప్రభుత్వం పూర్తి జవాబుదారితనంతో దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో భారత్‌ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. భారత్‌ దర్యాప్తు తుది వివరాలను తెలుసుకోవడానికి ఎదురుచేస్తున్నాం’’ అని మిల్లర్‌ తెలిపారు.

పన్నూ హత్యకు భారతీయ వ్యక్తి నిఖిల్‌  గుప్తా ( 52 ) మరో వ్యక్తితో కలసి కుట్ర చేశారనే ఆరోపణలపై చెక్‌ రిపబ్లిక్‌ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన్ను విచారించేందుకు చెక్‌ రిపబ్లిక్‌ పోలీసులు.. అమెరికాకు అప్పగించగా కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement