అక్కడంతా బంగారుమయమే! | New Gold Rush Found Worth 700 Million Pounds At Wales | Sakshi
Sakshi News home page

అక్కడంతా బంగారుమయమే!

Dec 23 2020 6:07 PM | Updated on Dec 23 2020 6:55 PM

New Gold Rush Found Worth 700 Million Pounds At Wales - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: క్రిస్మస్‌ పండుగ ముందు వారికో శుభవార్త తెలిసి ఎగిరి గంతులేస్తున్నారు. ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అంతటి ఆనందానికి ఆ శుభవార్త బంగారుమయం అవడమే. వేల్స్‌లోని స్నోడోనియాలో క్లోగావ్‌– సెయింట్‌ డేవిడ్‌ గనుల్లో దాదాపు 6.9 వేల కోట్ల రూపాయలు (700 మిలియన్‌ పాండ్లు) విలువైన బంగారు గని బయట పడింది. ఈ విషయాన్ని అక్కడ టెస్ట్‌ డ్రిల్లింగ్‌ జరిపిన ‘అల్బా మినరల్‌ రిసోర్సెస్‌’ కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవానికి 1998లోనే ఈ గనులను మూసివేశారు.

ఇటీవలనే ఈ గనులకు అక్కడి ప్రభుత్వం వేల పాటను నిర్వహించగా పలు గనుల తవ్వకాల కంపెనీలు పోటీ పడి బిడ్డింగ్‌లు వేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు గని ప్రాంతాలను విభజించి ఇచ్చారు. తమకు కేటాయించిన స్థలంలో దాదాపు ఐదు లక్షల ఔన్సుల బంగారం ఉన్నట్లు టెస్ట్‌ డ్రిల్లింగ్‌లో బయట పడడంతో అల్బా కంపెనీ వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మిగతా కంపెనీలకు ఇప్పటి వరకు అలాంటి అదష్టం తగల లేదట. 1862 సంవత్సరం నుంచి 1911 మధ్యకాలంలో ఈ గనుల నుంచి 2.4 బంగారాన్ని వెలికి తీశారు. ఇప్పుడు ఆ తవ్వకాలకు సరిగ్గా 500 మీటర్ల దూరంలో తాజా బంగారం నిల్వలు బయట పడ్డాయి.

1862కు ముందు ఆ గనుల్లో రాగి, సీసం తీశారు. ఆ సంవత్సరం నుంచే బంగారు నిల్వలు బయట పడ్డాయి. బ్రిటన్‌లో ఇప్పటి వరకు బయట పడిన బంగారంలో 90 శాతం సెయింట్‌ డేవిడ్‌ గనుల నుంచి వచ్చిందే. పైగా అక్కడి బంగారం అత్యంత స్వచ్చమైనది, విలువైనదని బంగారం నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రిటిష్‌ రాజ వంశమంతా తమ పెళ్లిళ్ల ఉంగరాలను అక్కడి బంగారంతోనే చేయించుకున్నారట. బ్రిటీష్‌ రాణి ఎలిజబెత్, యువ రాణి డయానా పెళ్లి రింగులు అక్కడి బంగారంతో చేసినవేనట.

Advertisement
 
Advertisement
Advertisement