బెర్లిన్: ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖమేనీ మరణించారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో యుద్ధ భయంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దేశాన్ని వీడి వెళ్లారనే సమాచారం అందుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల అనంతరం ఖమేనీ మృతిచెందినట్లు ఆధారాలు ఉన్నాయని ప్రధాని నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఖమేనీ మరణించినట్లు ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ను వీడి విదేశాలకు వెళ్లారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెతన్యాహు అధికారిక విమానం ‘వింగ్ ఆఫ్ జియాన్’ (4X-ISR) ఇజ్రాయెల్ తీరంలో సుమారు నాలుగు గంటల పాటు గగనతలంలో చక్కర్లు కొట్టిన అనంతరం గ్రీస్ మీదుగా జర్మనీకి వెళ్లినట్లు ఫ్లైట్ రాడార్ డేటా ద్వారా వెల్లడైంది. శనివారం నెవాటిమ్ వైమానిక స్థావరం నుండి బయలుదేరిన ఈ బోయింగ్ 767-338ER విమానం, రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జర్మనీ రాజధాని బెర్లిన్లో ల్యాండ్ అయినట్లు సమాచారం. అయితే బెర్లిన్లో ప్రధాని నెతన్యాహుకు సంబంధించి ఎటువంటి అధికారిక పర్యటన ఖరారు కాకపోవడంతో ఆయన నిజంగానే ఆ విమానంలో ఉన్నారా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది.
అయితే నెతన్యాహు ఇజ్రాయెల్ నుండి పారిపోయి గ్రీస్ వెళ్లారని వస్తున్న ప్రచారాన్ని ‘గ్రోక్’ వంటి ఏఐ ప్లాట్ఫారమ్లు కొట్టిపారేశాయి. ఇరాన్పై జరిగిన దాడుల గురించి వివరిస్తూ, నెతన్యాహు ఇజ్రాయెల్ నుండే వీడియో సందేశాన్ని విడుదల చేశారని, ఆయన ఇక్కడే ఉన్నారని రాయిటర్స్, ఏపీ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రధాని ప్రస్తుతం ఇజ్రాయెల్లోనే ఉన్నారా లేక భద్రతా కారణాల దృష్ట్యా జర్మనీకి తరలివెళ్లారా అనే అంశంపై ప్రభుత్వం నుండి అధికారిక వివరణ రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఆయుధాలు వీడకుంటే చావే: ట్రంప్ వార్నింగ్


