నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వందల అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలు కాగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కవ్రేపలాంచోక్ జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీ వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు నమోబుద్ధ మున్సిపాలిటీ పరిధిలోని సెల్ఫీ డాండా ప్రాంతంలో అదుపుతప్పి సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే.. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
జిల్లా పోలీసు కార్యాలయం వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొందరిని గుర్తించగా.. మరికొందరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన 16 మందిని ధులిఖేల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
#Nepal | Eight dead and 15 injured in bus accident in Kavre
The bus fell some 200 m off the road in Namobudhha municipality. The 15 injured are undergoing treatment at the Dhulikhel hospital.
A passenger bus heading to Sungure of Roshi Rural Municipality from Banepa had met… pic.twitter.com/aWrSS4U1Wu— DD News (@DDNewslive) June 12, 2026
ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు స్టీరింగ్లో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు.. బస్సు సాధారణ వేగంతోనే ప్రయాణిస్తోందని చెప్పాడు. అయితే ఓ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వాహనానికి దారి ఇవ్వడానికి ప్రయత్నించే సమయంలో బస్సు రోడ్డు నుంచి జారి లోయలోకి దూసుకెళ్లిందని చెప్పాడు.
దీంతో స్టీరింగ్ జామ్ కావడం వల్లే.. డ్రైవర్ వాహనంపై కంట్రోల్ తప్పి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది దర్యాప్తు అనంతరమే వెల్లడించనున్నారు.
మరోవైపు.. నిన్న నేపాల్లోని ధన్కుటా జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై బస్సు బోల్తాపడటంతో 12 మందికి గాయాలయ్యాయి.


