Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు | Myanmar shakes 15 Times in 24 hours Earthquake | Sakshi
Sakshi News home page

Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు

Mar 30 2025 9:36 AM | Updated on Mar 30 2025 12:50 PM

Myanmar shakes 15 Times in 24 hours Earthquake

నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్‌(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ‍ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి  భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు.  భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.

ఇదేవిధంగా మయన్మార్‌లోని  ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా  భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది.  ఈ నేపధ్యంలో భారత్‌.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement