అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని నజీబ్‌.. 12 ఏళ్ల జైలు శిక్ష

Published Wed, Aug 24 2022 7:50 AM

Malaysia Former Prime Minister Najib Razak Has Been Sent To Jail - Sakshi

పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్‌ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్‌ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్‌(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది.

మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్‌మెంట్‌ బెహ్రాత్‌(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్‌ డాలర్లను నజీబ్‌ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్‌ఆర్‌సీ ఇంటర్నేషనల్‌ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్‌ను ఈ కేసు విచారణ ప్యానెల్‌ నుంచి తప్పించాలంటూ నజీబ్‌ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది.

ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం!

Advertisement
Advertisement