గుండెల్ని కదిలించే వీడియో.. ఈపాటి విశ్వాసం మనిషికెక్కడిది?

Languars Pay Last Respects to Owners Sri Lanka Dhone Videos Viral - Sakshi

మనిషికి విశ్వాసం ఏమాత్రం?..  మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. 

మరో ఘటనలో.. నంద్యాల డోన్‌ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది. అలా రోజూ వచ్చే కొండముచ్చుకు.. మంగళవారం నాడు లక్ష్మీదేవి కనిపించలేదు. ఆకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బంధవులు అంత్యక్రియల కోసం శవయాత్రను ఓ వాహనంలో నిర్వహించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆ కొండముచ్చు ఆ వాహనం వెంట పరుగులు తీయడాన్ని కొందరు రికార్డు చేసి వైరల్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top