
టెహ్రాన్ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు.
ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్ 23వ తేదీ) పారిస్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇక్కడ(ఇరాన్) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.
పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు.
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి.
ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు.