
టెల్ అవీవ్/గాజా: గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆహార పంపిణీ కేంద్రం జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన 11 మంది ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. దక్షిణ గాజాలోని అల్–మవాసిలో శరణార్ధులున్న టెంట్పై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని వఫా వార్తా సంస్థ తెలిపింది. నుసెయిరత్లో జరిగిన వైమానిక దాడిలో నలుగురు చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించిన ‘సేఫ్ జోన్’లోనే ఈ టెంట్ ఉందని పేర్కొంది.
గడిచిన 48 గంటల వ్యవధిలో గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన మారణకాండలో కనీసం 202 మంది చనిపోగా 1,037 మంది క్షతగాత్రులుగా మిగిలారు. కాగా, గాజాలో సోదాల సమయంలో హమాస్ ఎత్తుకుపోయిన వారిలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. వీరిని యోనాటన్ సమెరనో(21), ఒఫ్రా కెయిడర్(70), షే లెవిన్సన్(19)గా గుర్తించింది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇతర జిహాదీ గ్రూపులు జరిపిన మెరుపుదాడిలో వీరు చనిపోయారని వివరించింది. హమాస్ చెరలో ఇప్పటికీ 50 మంది వరకు ఉన్నారని, వీరిలో సగం కంటే తక్కువమందే సజీవులుగా ఉన్నట్లు భావిస్తున్నామంది.