హూస్టన్ కాలేజీకి 40 లక్షల డాలర్ల విరాళం
హూస్టన్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్కు భారతీయ అమెరికన్ జంట రూ.38.25 కోట్ల (40 లక్షల డాలర్ల) విరాళాన్ని అందజేసింది. భారతీయ అమెరికన్ ఇంజినీర్ మన్మోహన్ సింగ్ కాల్సి, ఆయన భార్య మేరీ లూయిస్ షుబెర్ట్ కాల్సి ఈ మొత్తాన్ని పరిశోధన, విద్య కోసం అందజేశారని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మొత్తంతో వర్సిటీలోని కుల్లెన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో రెండు ఎండోవ్డ్ ప్రొఫెసర్షిప్లు, ఒక ఫ్యాకల్టీ రీసెర్చ్ ఫండ్, గ్రాడ్యుయేట్ ఫెలోషిప్లు, ఒక సెమినార్ సిరీస్ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.
మన్మోహన్ కాల్సి వర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి, పారిశ్రామికవేత్తగా ఎదిగారని, సుదీర్ఘ కాలం వర్సిటీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని డీన్ ప్రదీప్ శర్మ చెప్పారు. మన్మోహన్ కాల్సి హూస్టన్ వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్డీ పూర్తి చేశారు. హైడ్రోడైనమిక్ రోటరీ సీలింగ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న కాల్సి ఇంజినీరింగ్ అనే కంపెనీని ఆయన 1978లో నెలకొల్పారు.


