India Will Take Military Action If China-Pak Provocation: US Intelligence Report - Sakshi
Sakshi News home page

కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు

Mar 10 2023 4:47 AM | Updated on Mar 10 2023 9:55 AM

India will take military action if China-Pak provocation - Sakshi

వాషింగ్టన్‌: పాకిస్తాన్, చైనాలతో భారత్‌ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్‌ కవ్వింపులను భారత్‌ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్‌పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి.

‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌ది. అందుకే ఇకపై పాక్‌ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్‌ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్‌ ఘర్షణ, తాజాగా అరుణాచల్‌ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది.

చైనాతో అమెరికాకు పెనుముప్పు
అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్‌ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్‌ సెలెక్ట్‌ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement