భారత్‌ అగ్రరాజ్యానికి మిత్ర పక్షం కాదు..వైట్‌హౌస్‌ అధికారి షాకింగ్‌ వ్యాఖ్యలు | India US Relationship White House Official Asserted Wont Be US Ally | Sakshi
Sakshi News home page

భారత్‌ అగ్రరాజ్యానికి మిత్ర పక్షం కాదు..వైట్‌హౌస్‌ అధికారి షాకింగ్‌ వ్యాఖ్యలు

Dec 9 2022 12:53 PM | Updated on Dec 9 2022 2:55 PM

India US Relationship White House Official Asserted Wont Be US Ally - Sakshi

విశిష్ట వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న భారత్‌, అమెరికాకు మిత్రపక్షంగా...

భారత్‌ అగ్రరాజ్యానికి మిత్రపక్షంగా ఉండబోదంటూ వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి కర్ట్ క్యాంప్‌బెల్ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా..భారత్‌ గురించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు విశిష్ట వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న భారత్‌, అమెరికాకు మిత్రపక్షంగా ఉండదని, ఒక గొప్ప శక్తిగా ఉంటుందని అన్నారు. గత 20 ఏళ్లో భారత్‌ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలోపేతంగా వేగంగా ఏర్పడ్డాయని అన్నారు. అమెరికాకు భారత్‌ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం అని కూడా చెప్పారు.

అలాగే అమెరికా తన సామర్ధ్యానికి అనుగుణంగా ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, సాంకేతికంగా ఇతర సమస్యలపై కలిసి పనిచేయడం ద్వారా ప్రజలతో సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదీగాక ఇరు దేశాల్లోని కేంద్రీకృత ప్రభుత్వ విధానాల్లో పలు సవాళ్లు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఇరు దేశాలు కలిసి పనిచేసే అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అంతరిక్షం, విద్య, వాతావరణం, సాంకేతికత తదితర వాటిల్లో ఇరు దేశాలు సమన్వయంగా ముందుకు సాగాలని చెప్పారు. అలాగే భారత్‌ అమెరికా సంబంధాలు కేవలం చైనా చుట్టూ ఉన్న ఆందోళనలతో ఏర్పడలేదని నొక్కి చెప్పారు.

వనరులు అధికంగా ఉన్న బీజింగ్‌ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు ఏర్పరచి సైనిక స్థావరాలను నిర్మించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా క్యాంప్‌బెల్ ప్రస్తావించారు. ఈ విషయంలో తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, బ్రూనై, మలేషియా, వియత్నాం తదితర దేశాలు చైనాను తప్పుపట్టాయన్నారు. చైనాకు జపాన్‌తో కూడా ప్రాదేశిక వివాదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం గురించి మోదీతో చర్చించినప్పుడూ చైనా తన ప్రయోజనాల కోసం నిర్మించుకున్నారంటూ... కొట్టిపారేశారని చెప్పారు.

కాగా, బైడెన్‌ తన పరిపాలను క్వాడ్‌ లీడర్‌ స్థాయికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి (ఆంథోనీ) అల్బనీస్ 2023లో ఒక ప్రధాన క్వాడ్ సమావేశానికి అమెరికాను ఆహ్వానించిన సంగతిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ క్వాడ్‌ సమావేశం నాలుగు కీలక దేశాల మధ్య సమన్వయ సహకారాన్ని చాలా స్ట్రాంగ్‌గా బలోపేతం చేస్తోందని  క్యాంప్‌బెల్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరీన జీన్‌ పియర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...భారత్‌, యునైటెడ్‌ స్టేల్స్‌ల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. జీ20లో భారత్‌ నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడమే గాక భారత్‌తో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా, లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారతదేశంలోని యుఎస్ రాయబారిగా నియమించాలని బైడెన్ పరిపాలన చూస్తున్నట్లు కూడా జీన్‌ పియర్‌ తెలిపారు.

(చదవండి: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్‌)

Advertisement
 
Advertisement
Advertisement