Kim Jong-un: ‘నేను ఉండగా కాల్పులా?’.. ఉగ్రుడైన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఏం చేశాడంటే..

Firing Near Kim Jong Un Event North Korea Military Get Angry - Sakshi

ప్రపంచం ఫోకస్‌ అంతా గత కొన్నివారాలుగా ఉక్రెయిన్‌ పరిణామాలపైనే ఉంటోంది. ఈ తరుణంలో కొరియా దేశాలు ఏం చేస్తున్నాయన్న? ఆసక్తి కొందరిలో ఉంది. అయితే ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో అప్రమత్తమైన ఈ దాయాది దేశాలు తమ తమ అణ్వాయుధాలకు పదును పెట్టుకుంటున్నాయట. ఈ తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హాజరైన ఓ ఈవెంట్‌కి  ఎక్కడో దూరంగా తూటా పేలగా.. కోపంతో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కఠిన శిక్షలు అమలు చేశాడు. 

డెయిలీ నార్త్‌ కొరియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి 16-18 తేదీల మధ్య సౌత్‌ హాంగ్యోంగ్‌ ప్రావిన్స్‌లో మిలిటరీ కమిటీ సమావేశాలు జరిగాయి. అదే టైంలో యోన్పోలోని హమ్జు కౌంటీలోని Greenhouse Farmలో Groundbreaking Ceremony కార్యక్రమానికి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హాజరు కావాల్సి ఉంది. దీంతో 17, 18 తేదీల్లో రెండురోజుల పాటు లాక్‌డౌన్‌తో కట్టడి చేసేసింది అక్కడి మిలిటరీ. అంతేకాదు కమ్యూనికేషన్‌ వ్యవస్థల కట్టడితోపాటు దారులన్నింటిని మూసేసి భద్రతను కట్టుదిట్టం చేసేసింది.

సరిగ్గా కిమ్‌ ఈవెంట్‌లో పాల్గొంటుండగా.. హమ్జూ కౌంటీ పొరుగునే ఉన్న చోంగ్‌ప్యోంగ్‌ కౌంటీ సిన్‌సాంగ్‌ స్టేషన్‌ ఆర్మీ సెక్యూరిటీ విభాగంలో దగ్గర కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కమాండర్‌ల మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది. ఆ ఘర్షణలో ఒకరు.. ఇంకొకరిని కాల్చి చంపేశారు. అదే రోజు సాయంత్రం విషయం బయటకు పొక్కింది. కిమ్‌ లాంటి సుప్రీం లీడర్‌ పర్యటిస్తున్న వేళ.. ఇలాంటి ఘటన జరగడంపై నార్త్‌ కొరియా మిలిటరీ సీరియస్‌ అయ్యింది. దీంతో సదరు సెక్యూరిటీ బేస్‌.. స్వీయ విమర్శలతో కూడిన ఓ క్షమాపణ లేఖ రాసి ఇచ్చింది. 

ఇంతవరకు బాగానే ఉన్నా.. కిమ్‌ ఊరుకుంటాడా? వెంటనే ఆ మిలిటరీ బేస్‌ చీఫ్‌ను తొలగించి.. ఏడేళ్ల బానిస శిక్షను అమలు చేయాలని ఆదేశించాడు. అంతేకాదు ఈ ఘటనలో జోక్యం చేసుకున్న మరో ఇద్దరు సైనికులను యోంగ్‌వాంగ్‌ కౌంటీ పొలాల్లో కూలీలుగా జీవితాంతం బతకాలంటూ శిక్ష విధించాడు. ఇక కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని అదేరోజు రాత్రి అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. కిమ్‌ జోంగ్‌ ఉన్‌లాంటి గొప్ప లీడర్‌ హాజరైన కార్యక్రమానికి అతి సమీపంలో కాల్పులకు తెగబడినందుకు.. ఉద్రిక్త పరిస్థితులను రేకెత్తించినందుకుగానూ ఆ వ్యక్తికి మరణ శిక్షను విధించారు. ఇలాంటి ఘటనను దాచి పెట్టే ఆస్కారం ఉన్నా.. అధ్యక్షుడి మీద గౌరవంతో బయట పెట్టినందుకు మిలిటరీ కమిటీని పొగడ్తలతో ముంచెత్తింది నార్త్‌ కొరియా సెంట్రల్‌ కమిటీ. అక్టోబర్‌ నెలలో వీలైతే ముందుగానే ఆ వ్యక్తిని కాల్చి చంపడం ఖాయమని డెయిలీ నార్త్‌ కొరియా కథనం ప్రచురించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top