
వాషింగ్టన్: అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సారథ్య పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు. ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావిస్తూ డోజ్కు వీడ్కోలు పలకబోతున్న అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే డోజ్ బృందంలోని కీలకమైన ఏడుగురు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సంస్థ తదుపరి కార్యాచరణపై చర్చించారు.
ఆరామ్ మొఘాద్దాషీ, స్టీవ్ డేవిడ్, బ్రాడ్ స్మిత్, ఆంటోనీ ఆర్మ్స్ట్రాంగ్, జోయీ గిబ్బియా, టోమ్ క్రాస్, టైలర్ హసేన్లతో మస్క్ సమావేశమయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్ ట్రంప్కు కుడిభుజంగా వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. దాంతో ఆయన తప్పుకున్నాక డోజ్ విభాగం ఉంటుందా, ఉంటే నూతన సారథి ఎవరంటూ చర్చ మొదలైంది.
సొంత సమస్యలను పరిష్కరించుకునేందుకే మస్క్ ఇలా హడావుడిగా డోజ్ నుంచి వైదొలగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన టెస్లా కంపెనీ కార్ల పనితీరు, సంస్థలో శ్వేతజాతీయేతర ఉద్యోగుల పట్ల వివక్ష, భాగస్వాముల విభేదాలు, వినియోగదారుల ఫిర్యాదుల వంటి సమస్యలతో మస్క్ సతమతమవుతున్నారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నాకే డోజ్ నుంచి నిష్క్రమించబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘అమెరికా ఆర్థిక భారాన్ని కనీసం ట్రిలియన్ డాలర్ల మేర తగ్గించాలన్న లక్ష్యం దాదాపు సాధించాం’’అని చెప్పారు.