
కోపెన్హాగన్: న్యూఇయర్ రోజున డెన్మార్క్ రాణి మార్గరేట్-II(83) కీలక ప్రకటన చేశారు. జనవరి 14న తాను పదవీ విరమణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తన కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్కు తన బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు.
యూరప్లోనే అత్యధికంగా 52 ఏళ్లుగా పదవిలో ఉన్న చక్రవర్తిగా మార్గరేట్-II నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తర్వాత యూరప్లో అధికారంలో ఉన్న ఏకైక రాణి మార్గరేట్. డెన్మార్క్ టెలివిజన్లో ప్రసారమయ్యే సాంప్రదాయ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆమె తన వయస్సు, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఆశ్చర్యకరంగా పదవీ విరమణ ప్రకటన చేశారు.
డెన్మార్క్లో 1972లో సింహాసనం అధిరోహించిన రాణి మార్గరేట్.. చక్రవర్తిగానే గాక వివిధ కళల్లో ఉన్న ప్రతిభతో సాధారణ ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ఆమె హయాంలోనే డెన్మార్క్ సహా ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, 1970, 1980నాటి ఆర్థిక సంక్షోభాలు, 2008 నుంచి 2015 మధ్య తీవ్ర కరువు, కరోనా మాహమ్మారి వంటి పరిస్థితులను డెన్మార్క్ ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెన్మార్ను ఐక్యంగా ఉంచడంలో ఆమె సఫలం అయ్యారు.
మెరిసే నీలి కళ్లతో నిత్యం ఉత్సాహంగా ఉండే మార్గరేట్.. అనేక కళల్లో నిష్ణాతురాలు. పేయింటింగ్, కాస్ట్యూమ్, సెట్ డిజైనర్గా రాయల్ డానిష్ బ్యాలెట్, రాయల్ డానిష్ థియేటర్తో కలిసి పనిచేశారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. "ఆల్ మెన్ ఆర్ మోర్టల్"తో సహా అనేక నాటకాలను కూడా ఆమె అనువదించారు.
ఇదీ చదవండి: మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్