మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో సీనియర్ సైనిక అధికారి, లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ మృతిచెందారు. రష్యన్ జనరల్ స్టాఫ్ పరిధిలోని ‘ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్’ అధిపతిగా పనిచేస్తున్న సర్వరోవ్, తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. వాహనం కింద అమర్చిన పదార్థం కారణంగానే పేలుడు సంభవించి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా దర్యాప్తు కమిటీ ధృవీకరించింది.
ఈ హత్య వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక నిగూఢ సేవల (Special Services) ప్రమేయం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణను ప్రారంభించారు. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగిన నేపథ్యంలో, ఇది ఉక్రెయిన్ గూఢచారి సంస్థల పథకమేనని రష్యా అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ నుంచి అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు.
కాగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఫ్లోరిడాలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు నిర్మాణాత్మక రీతిలో సాగుతున్నాయని క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఒడేసాలోని ఓడరేవు లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 27 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. ఓడరేవు మౌలిక సదుపాయాలు, సమీపంలోని వాహనాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలు శాంతి ప్రయత్నాలపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం


