వెయ్యిరెట్లకు మించి ప్రతీకారం : ట్రంప్ | Sakshi
Sakshi News home page

వెయ్యిరెట్లకు మించి ప్రతీకారం : ట్రంప్

Published Tue, Sep 15 2020 2:11 PM

DoTrump warns Iran of 1000 times greater retaliation in case of any attack - Sakshi

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికాపై ఏదైనా దాడి జరిగితే అంతకుమించి "1,000 రెట్లు ఎక్కువ" ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.ఇరాన్ టాప్ మిలటరీ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు మీడియా వార్తలు రావడంతో  ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేశారు.  ఉగ్రవాద నాయకుడు సులేమాని హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్ హత్య, లేదా ఏ రూపంలోనైనా,ఎలా దాడిచేసినా దానికి వెయ్యిరెట్లు అధికంగా ప్రతి స్పందిస్తామంటూ ట్విట్ చేశారు.  (ఇరాన్‌ ప్రతీకారం)

దక్షిణాఫ్రికాలోని అమెరికా రాయబారి లానా మార్క్స్‌పై ఇరాన్ ప్రభుత్వం హత్యాయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఇదే జరిగితే అమెరికా, ఇరాన్ల మధ్య మరింత ఉద్రిక్తతలు రాజుకోనున్నాయని పేర్కొంది. ఇరాన్ గతంలో అమెరికన్ రాయబారులపై హత్యలను ప్రణాళిక వేపిన నేపథ్యంలో ఈ వార్తలను ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. అటు ఈ అంశంపై స్పందించిన దక్షిణాఫ్రికా స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎస్ఎస్ఎ) దక్షిణాఫ్రికా పౌరులు, ఇతర డిప్లొమాటిక్ అధికారులతో సహా యుఎస్ రాయబారి భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించింది. మరోవైపు  ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. నవంబర్ 3న జరగనున్న ఎన్నికలకు ముందు ఇరాన్ వ్యతిరేక ప్రచారంలో భాగమే ఈ ఆరోపణలని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖతీబ్జాదే ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా  ఈ ఏడాది జనవరి 3న ఇరాక్‌లో డ్రోన్ దాడితో రివల్యూషనరీ గార్డ్స్ కుడ్స్ ఫోర్స్ నేత సోలైమానిని  అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 2015 అణు ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉందంటూ అమెరికా వైదొలగిన తరువాత నుంచి వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. (ట్రంప్‌ తలపై రూ.575 కోట్లు)

Advertisement
Advertisement