‘డబుల్‌’ సంతోషం.. సాక్షితోనే..

ఎన్నో ఏళ్లుగా అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు ఇళ్లలో పేదలు దుర్భర జీవనం సాగిస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఐడీహెచ్‌ కాలనీలో సాక్షి జనసభ నిర్వహించింది. కార్యక్రమంలో ఐడీహెచ్‌ కాలనీవాసులు గళమెత్తారు. శిథిలమైన ఇళ్లలో తమ జీవితాలు దినదిన గండంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సాక్షి దినపత్రిక చర్చకు తెరలేపడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో ఐడీహెచ్‌ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి కదలిక ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 1, 2014న సీఎం కేసీఆర్‌ ఐడీహెచ్‌ కాలనీలో పర్యటించి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 396 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించి 2015 నవంబర్‌ 17న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

సరోగసీపై ఆంక్షలకు పురుడు..

జమైకాకు చెందిన తండ్రి, అమెరికాకు చెందిన తల్లి నగరంలోని ఓ ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్‌లో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన బిడ్డకు పాస్‌పోర్ట్‌ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దీంతో పాపను తల్లిదండ్రులు పాస్‌పోర్ట్‌ ఆఫీసులోనే వదలివెళ్లారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో ఈ బిడ్డది ఏ దేశం? అంటూ.. ప్రత్యేక కథనం ప్రచురితమైంది. సరోగసీ ప్రసవాలపై ‘సాక్షి’ కథనం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత విదేశీయులు ఇక్కడ సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అంశాన్ని ప్రభుత్వం నిషేధించింది. స్థానిక సరోగసీ ప్రసవాలపై కూడా అనేక ఆంక్షలు విధించింది. అద్దెకు అమ్మ కడుపు శీర్షికన కూడా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

పసికందులపై క్లినికల్‌ ట్రయల్స్‌..

● నిలోఫర్‌ ఆస్పత్రిలో పసికూనలపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న అంశాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇదే అంశంపై అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. ప్రభుత్వం చిన్నారులపై నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌పై ఆంక్షలు విధించింది.

ఆస్పత్రుల్లో అవినీతిపై..

● ఉస్మానియా సహా నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో గౌరీ శానిటేషన్‌ ఏజెన్సీని రద్దు చేసి, కేసు నమోదు చేసి, జైలుకు కూడా పంపింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య ఉద్యోగుల హాజరుపై ఆ తర్వాత అనేక సంస్కరణలు చేపట్టడంలో ‘సాక్షి’ చూపిన చొరవ అనుపమానం.

డిస్కంలో బకాయిలపై..

● డిస్కంలో ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించని యూనియన్ల తీరును బకాయి.. లడాయి శీర్షికన ప్రత్యేక కథనంతో ఎండగట్టింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లించే వరకు వరుస కథనాలు ప్రచురించింది. అంతేకాదు కొత్త కనెక్షన్ల మంజూరు, ప్యానల్‌ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు తదితర అంశాలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. ముగ్గురు ఏడీఈలు, నలుగురు ఏఈలపై వేటుకు ‘సాక్షి’ దోహదపడింది.

అనైతిక వైద్యాన్ని నిలదీసి..

● నిఖిల్‌రెడ్డికి ఎత్తు పెంపు సర్జరీ అంశాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వెలుగు చూస్తున్న అనైతిక వైద్యంపై రాసిన కథనం వైద్యారోగ్య శాఖను అప్పట్లో ఓ కుదుపు కుదిపివేసింది. సర్జరీ చేసిన వైద్యులపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఆంక్షలు విధించింది. అయిదేళ్ల పాటు వారి ప్రాక్టీస్‌ను సస్పెండ్‌ చేసింది.

ఆణిముత్యాలకు అండగా..

● పేద కుటుంబంలో పుట్టి టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన ఆణిముత్యాలకు సాక్షి అండగా నిలిచింది. దాతలను సమీకరించి.. వారికి ఉన్నత చదువులు చదివించే విషయంలో అండగా నిలిచింది.

కథనాలతో కదలిక!

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top