హుస్సేన్ సాగర్లో జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ టోర్నీ
పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు
తొలిరోజు సంచలన విజయం సాధించిన మల్కాజిగిరి బాలుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న ‘17వ మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్’ నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ప్రారంభమైంది.
మంగళవారం గాలి వేగం తగ్గడంతో ప్రిన్సిపల్ రేస్ ఆఫీసర్ చంద్రశేఖర్ దలై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక రేసును మాత్రమే పూర్తి చేయగలిగారు. బాలికల అండర్–15 విభాగంలో సికింద్రాబాద్ క్లబ్కు చెందిన సృష్టి సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదటి రోజు ముగిసే సమయానికి బాలుర విభాగంలో నిల్కొండ మణి (1 పాయింట్) అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో సృష్టి సింగ్ (4 పాయింట్లు) టాప్లో నిలిచింది.
సెయిలింగ్లో ‘మణి’రత్నం..
మల్కాజిగిరికి చెందిన 13 ఏళ్ల నిల్కొండ మణి తొలి రేసులో మొదటి స్థానంలో నిలిచాడు. 30 నిమిషాల పాటు సాగిన ఈ రేసులో తన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు 2 నిమిషాల భారీ ఆధిక్యంతో మణి విజయం సాధించాడు.


