సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ నక్కలగుట్ట లోని అమరవీరుల స్తూపం జంక్షన్లోని లింగాల కే దారి హోటల్ ఉమ్మడి జిల్లావాసులకు సుపరిచితం. ఆ హోటల్ యజమాని లింగాల కేదారి దంపతులు సేవాభావం, పేదోడి ఆకలి తీర్చే వ్యక్తులుగా గుర్తింపు. అగ్నిప్రమాదం ఆ దంపతుల్లో ఒకరిని బలితీసుకుంటే మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బుధవారం రాత్రి సుమారు 7.45 గంటల ప్రాంతంలో లింగాల కేదారి హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో లింగాల కేదారి(60) అక్కడికక్కడే చనిపోగా, భార్య పుష్పలత 90 శాతానికిపైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ఆస్పత్రికి చేరుకుని ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
లాభార్జనకంటే మానవీయతకే పెద్దపీట
తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన అమరవీరుల స్తూపం దగ్గర ఉన్న లింగాల కేదారి హోటల్ యజమాని కేదారి నాడు ఎంతోమంది ఉద్యమకారులకు ఉచితంగా అన్నం పెట్టారు. ఇద్దరు వ్యక్తులు వృథా చేసే భోజనం మరొకరి అకలి తీరుస్తుందని, విలువైన సూక్తులను హోటల్లో రాయించి అందరికీ అన్నం విలువ తెలియజేశాడు. చైనీస్ గారె సృష్టకర్తగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ప్రతీనెల కొన్ని రోజులపాటు అందరికీ ఉచితంగా టిఫిన్లు పెట్టి తన సేవాభావం చాటుకుంటున్నారు. కేదారి చేస్తున్న సేవా కార్యక్రమాలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం కేదారితో మన్కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు, ఓరుగల్లు ప్రజలు లింగాల కేదారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాభార్జన కంటే మానవీయతకే పెద్దపీట వేస్తూ హోటల్ను నిర్వహించారని గుర్తు చేసుకున్నారు.
హోటల్లో అగ్నిప్రమాదం..
లింగాల కేదారి మృతి
ప్రాణపాయస్థితిలో
ఆయన భార్య పుష్పలత
లాభార్జన కంటే మానవీయతకే
పెద్దపీట వేసిన కేదారి
తెలంగాణ ఉద్యమం సమయంలో ఉచితంగా భోజనం


