కలెక్టర్, సొసైటీ అధ్యక్షురాలు సత్యశారద
న్యూశాయంపేట: వరంగల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, సొసైటీ అధ్యక్షురాలు సత్యశారద అన్నారు. ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల పర్యవేక్షకుడిగా అదనపు కలెక్టర్ వై.వీ.గణేశ్ను, ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి నీరజను నియమించినట్లు తెలిపారు. ఈసందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కలెక్టర్ విడుదల చేశారు. జాబితాను కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు, చేర్పులు, సవరణలకు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కోరారు. ఈనెల 14 వరకు జాబితా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
పర్యాటకాభివృద్ధికి మూడేళ్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఏ.వాణి ప్రసాద్ అన్నారు. బుధవారం పర్యాటక అభివృద్ధి, జ్ఞాన భారతం మిషన్పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వై.వీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, రెడ్ క్రాస్ సొసైటీ పాలక మండలి సభ్యుడు ఈ.వీ.శ్రీనివాస్, డీసీఓ నీరజ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ భార్గవ్, ఉపాధి కల్పనాధికారి సాత్విక, ఏడీ ఆర్కియాలజీ గంగా పాల్గొన్నారు.


