రేకులు తొలగిస్తుండగా జారిపడి వ్యక్తి..
మహబూబాబాద్ రూరల్ : పొట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బయ్యారం మండలానికి చెందిన కందిపాటి యాకన్న (37) స్థానిక శ్రీ వెంకటేశ్వర వెల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ షాపులో పనిచేస్తూ మహబూబాబాద్లోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ షాపు పక్కనే ఉన్న కొండి లావణ్య, స్వాతిలత ఇంటి వద్ద రేకులు తొలగించే పని ఉండగా యాకన్న అక్కడ పనికి వెళ్లాడు. శనివారం సాయంత్రం రేకులు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు అతడు జారిపడిపోగా తలకు గాయమైంది. గమనించిన స్థానికులు, షాపు నిర్వాహకులు, కుటుంబ యజమాని ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. యాకన్నకు భార్య ఉమ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉమా ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
బావిలో పడి మహిళ..
నర్సంపేట రూరల్ : ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఆకులతండా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రాజన్బాబు కథనం ప్రకారం.. ఆకులతండాకు చెందిన బానోత్ స్వర్ణలలిత (35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే కోతుల బారినుంచి పంటను కాపాడేందుకు కావలిగా శనివారం వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు వెతికిన ఆచూకి లభించలేదు. ఆదివారం తెల్లవారుజామున వెళ్లి చూడగా బావిలో మృతిచెంది కనిపించింది. కోతులను కొట్టేందుకు అటువైపు వెళ్తు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయినట్లు ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి భర్త సునీల్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రమాదవశాత్తు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యక్తి, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఆకులతండా గ్రామంలో మహిళ మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.


