● రాష్ట్రస్థాయి కంప్యూటర్ ఆపరేటర్లు
హన్మకొండ చౌరస్తా: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, న్యాయపోరాటం చేస్తామని ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్లో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేతనాల్లో కోతలు, హోదాల మార్పులు, ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రూ.500 నుంచి రూ.14,000 వరకు వేతనాలు తగ్గించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఒకే రకమైన విధమైన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల హోదా పేరు మార్చి, వేతనం తగ్గించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు మున్సిపల్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, నీటి సరఫరా తదితర అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇది కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య కాదు, అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్య, ఒకరి హోదా మారితే, రేపు మరొకరి వేతనం తగ్గవచ్చు, అందుకే అన్ని శాఖల ఉద్యోగులు కలిసి పోరాడాలి అని సమావేశంలో ఉద్యోగులు ముక్తకంఠంతో నినదించారు. సమావేశంలో మియాపురం శ్రీకాంతాచారి, చరణ్ నరేశ్, భరద్వాజ్, గాయత్రి, సంతోష్ కుమార్, ప్రవీణ్, మాధవి, ప్రశాంత్ బాబు, రాజునాయక్, మహేశ్కుమార్, రంగా నెహ్రూ, లలిత, గంగాధర్, హరీష్, అబ్దుల్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.


