● మూడేళ్ల చిన్నారి దుర్మరణం
● గొల్లపల్లిలో విషాదం..
భీమదేవరపల్లి : పొలంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఎర్త్వైర్ రూపంలో విద్యుత్ షాక్ బలి తీసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వీరభద్రనగర్కు చెందిన బానోత్ సంపత్, సునీత దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. శనివారం గ్రామ శివారులోని పొలంలో పనులకు వెళ్తూ తమ మూడేళ్ల కుమారుడు రిషిని కూడా వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమవగా సమీపంలో ఆడుకుంటున్న రిషి ప్రమాదవశాత్తు విద్యుత్ ఎర్త్వైర్ను తాకాడు. విద్యుత్ సరఫరా వల్ల రిషి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చూసేసరికి అప్పటికే బాలుడు ప్రాణాలు విడిచాడు. రక్షణగా ఉండాల్సిన ఎర్త్ వైర్లోకి విద్యుత్ ప్రవాహం ఎలా వచ్చిందని గ్రామస్తులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణం పోయిందని మండిపడ్డారు. ప్రమాదానికి బాధ్యులైన విద్యుత్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుపేదలైన బానోత్ సంపత్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పొలాలు, నివాస ప్రాంతాల్లోని ఎర్త్ వైర్లు, విద్యుత్ స్తంభాలను తనిఖీ చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.
పోషించలేక
యువకుడి ఆత్మహత్య
చిట్యాల : తల్లిదండ్రులు లేకపోవడంతో తన తోబుట్టువుల పోషణభారం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని పాశిగడ్డతండా గ్రామంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా తిరుపతి (22), తల్లిదండ్రులు సురేష్–వసంత ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. తిరుపతి తన చదువును ఆపేసి ఓ హోటల్లో పనిచేస్తూ ఇద్దరు తమ్ముళ్లను, చెల్లి బాగోగులు చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా తల్లిదండ్రులు లేకపోవడంతో పాటు తోబుట్టిన వాళ్ల పోషణభారం ఎక్కువై మనస్తాపం చెంది, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తిరుపతి కుటుంబ సభ్యుడు భూక్య రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు.


