హన్మకొండ : ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందేనని పూర్వ తెలంగాణ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో పూర్వ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యాది సభ నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ జన సమితి సహకారం అందిస్తుందన్నారు. ఇది న్యాయమైన డిమాండ్ అన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ జేఏసీ ద్వారా నర్సంపేటలో తెలంగాణ ఉద్యమకారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని, విగ్రహం ఏర్పాటు పెద్ది సుదర్శన్ రెడ్డికి నిజమైన నివాళి అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధసూదనాచారి అన్నారు. తామంతా వెనుకాముందు ఆలోచిస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి.. కేసీఆర్కు నేరుగా సూచనలు చేసే వారని, నిక్కచ్చి నాయకుడని కొనియాడారు. నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటును అడ్టుకోవడం దుర్మార్గమన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నర్సంపేటను జిల్లా చేస్తారా? మెడికల్ కాలేజీ ఇస్తారా అని పట్టుబట్టి మెడికల్ కాలేజీ సాధించిన అభివృద్ధి కాముకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టడంతోపాటు విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కోదండరాం చొరవ తీసుకోవాలన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను ఆకలింపు చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. అతడి శక్తిని చూసి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు గుర్తు చేశారు. సభలో ఆయా పార్టీల నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
● పూర్వ తెలంగాణ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం


