తగ్గుతున్న ఆదాయం..
ఖాళీ ఎన్క్లోజర్స్..
న్యూశాయంపేట : చారిత్రక వరంగల్ నగరానికి తలమానికమైన కాకతీయ జులాజికల్ పార్క్ (వనవిజ్ఞాన కేంద్రం) రోజురోజుకూ తన వైభవాన్ని కోల్పోతోంది. ఒకప్పుడు పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల గర్జనలు.. పర్యాటకుల సందడితో కళకళలాడిన జూపార్క్ రానురాను సరైన నిర్వహణ లేక కనువిందు చేసే జంతువుల కొరతతో వెలవెలబోతోంది. అడవికి రాజులైన పులులు, సింహాలు లేకపోవడంతో వివిధ జిల్లాల నుంచి వ్యయప్రయాసలు కోర్చి ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. జూపార్క్ అనగానే గుర్తు కొచ్చే గత సంవత్సరంలో తీసుకొచ్చిన తెల్ల పులి శరణ్, శంకర్, అడవి దున్నల గర్జన వినడానికి, వాటి సంచారాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి వేలాది మంది పర్యాటకులు కుటుంబ సమేతంగా వచ్చేవారు. కానీ వయోభారంతో తెల్లపులి, మరిన్ని జంతువులు మరణించడం, మరికొన్నింటిని ఆరోగ్యరీత్యా హైదరాబాద్ జూపార్క్కు తరలించారు. తర్వాత వాటి స్థానంలో కొత్త వన్యప్రాణులను తీసుకురావడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఉత్సాహంతో జూపార్క్కు వస్తే ఖాళీగా ఉన్న బోన్లు, కొన్ని జింకలు, కోతులు, పక్షులు తప్ప ఏమి కనిపించడం లేదని పర్యాటకులు పెదవి విరుస్తున్నారు.
సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)
నిర్మాణమేది?
జూపార్క్లో మురుగు నీటి వ్యవస్థ తీవ్రంగా వేధి స్తోంది. హంటర్రోడ్ పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీల నుంచి మురుగు నీరు కాల్వ ద్వారా నేరుగా జూపార్క్లోకి చేరుతుంది. మురుగునీటి మళ్లింపు కోసం రూ. కోటి వ్యయంతో డ్రెయినేజీ పనులు చేపట్టారు. అయితే నిధుల కొరతతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేయడంతో సమస్య మరింత జఠిలమైంది. నిలిచిన మురుగునీరు దుర్వాసన, కాలుష్యం కారణంగా జంతువులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అనారోగ్యం పాలవ్వడంతో అధికారులు సేఫ్ ప్రదేశమైన నెహ్రూ జువలాజికల్ పార్క్కు తరలించాల్సి వచ్చింది. గతంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ ద్వారా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే ఎస్టీపీ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్న చందంగా మారింది. మురుగు నీటి వ్యవస్థ తక్షణ, శాశ్వత పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్.. అటవీశాఖ అధికారులతో కలిసి ఇటీవల పార్క్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. మురుగు నీటి ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నెలవారీగా పర్యాటకుల వివరాలు (ఏప్రిల్–2025 నుంచి మార్చి–2026 వరకు ఆదాయం)
మాసం పర్యాటకులు మొత్తంఆదాయం
(రూ.ల్లో)
1)ఏప్రిల్–25 15,931 9,44,080
2)మే –25 27279 14,92,330
3)జూన్– 25 22292 12,78,910
4)జూలై –25 16922 10,45,750
5)ఆగస్టు–25 19011 11,53,150
6)సెప్టెంబర్–25 12867 7,98,830
7)అక్టోబర్–25 17850 11,27,000
8)నవంబర్–25 30159 15,76,010
9)డిసెంబర్–25 39077 19,97,580
10)జనవరి–26 27874 15,93,570
11)ఫిబ్రవరి–26 15759 10,63,580
12)మార్చి–26 16210 9,66,380
మొత్తం 2,61,431 1,50,37,170
ఇక్కడ కనువిందు చేసే
వన్యప్రాణులు కానరాకపోయే!
వైభవం కోల్పోతున్న కాకతీయ
జులాజికల్ పార్క్
జంతు సంరక్షణలో అధికారుల
తీవ్ర నిర్లక్ష్యం
పులులు లేవు..
పర్యాటకుల పెదవి విరుపు
జూపార్క్లో ప్రధాన ఆకర్షణ(జంతువులు)లు కనుమరుగవ్వడంతో సందర్శకుల తాకిడి గణ నీయంగా పడిపోయింది. దీనికి తోడు కొన్ని వి భాగాలు నిర్వహణ సరిగా లేక అధ్వానంగా త యారయ్యాయి. ఇటీవలే అనారోగ్యంతో అడవి దున్న, కరెంట్ షాక్తో హైనా చనిపోయింది. రాయల్ బెంగాల్ టైగర్స్ ఎన్క్లోజర్స్లో జంతువులు లేక వెలవెలబోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎనిమల్ ఎక్సేంజీలో భాగంగా క్రూరమృగాలను ఇక్కడికి తీసుకొస్తామని గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలు గు ప్పించారు. కానీ ఆ ప్రకటనలు కాగితాలకే పరి మితమయ్యాయి. పార్క్లో అభివృద్ధి పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారే తప్ప జంతు సంరక్షణపై తగినంత పర్యవేక్షణ, శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సంరక్షణకు నిధుల కొరతనా లేక అధికారుల నిరక్ష్యమా.. అనే విషయం తెలియడం లేదని సామాజిక కార్యకర్తలు, పర్యాటకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి పార్క్లోకి ఆకర్షణీయ జంతువులను తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.


