ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాజీపేట మండలం రాంపూర్లో ఇటీవల జరిగిన పోలు వెంకటేశ్వర్లు (వెంకన్న)(45) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చే సిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పి.ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా చిల్పూరుకు చెందిన మృతుడు పోలు వెంకటేశ్వర్లు కుమార్తెను ప్రధాన నిందితుడు ఇదే గ్రామానికి చెందిన అంబటి పరమేశ్ కుమారుడు వినయ్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే మనస్పర్థలతో దంపతులు విడిపోవడంతో ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగాయి. 20 23లో జరిగిన ఓ పంచాయితీలో వెంకటేశ్వర్లు తనను తీవ్రంగా దూషించాడనే కక్షతో అతడిని అంతమొందించాలని పరమేశ్ నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 17న పథకం ప్రకారం పరమేశ్.. తనకు తెలిసిన చిల్పూరు పల్లెకు చెందిన దామెర సంపత్ను నమ్మబలికి వెంకటేశ్వర్లును బయటకు తీసుకెళ్లి మద్యం తాగించాలని కోరాడు. మరో నిందితుడు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్కు చెందిన చిలుముల వెంకటస్వామి కూడా హత్యకు సహకరిస్తే చట్టపరమైన సమస్యలను తాను చూసుకుంటానని పరమేశ్ భరోసానిచ్చాడు. ఈ క్రమంలో సంపత్.. వెంకటేశ్వర్లుకు మద్యం తాగించాక పరమేశ్ కూడా వారితో కలిసి తాగాడు. అనంతరం వెంకటేశ్వర్లును బైక్పై రాంపూర్ సమీపంలోని మడేలయ గుడి సమీపంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు కళ్లలో కారం చల్లి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం హత్యకు ఉపయోగించిన కత్తిని సమీపంలోని సిమెంట్ పైపుల్లో దాచిపెట్టాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులు పరమేశ్, సంపత్, వెంకటస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, ముగ్గురు నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.
వ్యక్తి దారుణ హత్య..
ఈ ఘటనలో ముగ్గురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన పోలీసులు


