కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పలు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై యూనివర్సిటీ అధికారులు ఇటీవల నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఏజెండాగా పెట్టారు. ఆయా అభివృద్ధి ప్రతిపాదనల్లో ఏ మేరకు అవసరాలు ఉన్నాయనే అంశాలను కేయూ పాలకమండలి సభ్యులు శుక్రవారం పరిశీలించారు. తొలుత హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి ఆయా ప్రతిపాదనలను వివరించారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో 40 కంప్యూటర్ల కోసం రూ. 30లక్షల వ్యయంతో, సెమినార్హాల్లో రూ. 10.80లక్షల వ్యయంతో ఫర్నిచర్ సదుపాయం, ఎంబీఏ విభాగంలో ఆరు తరగతి గదుల్లో రూ.14 లక్షల 78వేల 857తో ఫర్నిచర్ సదుపాయం అవసరమని పాలకమండలి సభ్యులకు వివరించారు. అనంతరం సుబేదారిలోని యూనివర్సిటీ శ్రీలాశ్రీ హాస్టల్ను సందర్శించి హాస్టల్లో మరమ్మతులు, ఎలక్ట్రిక్ వైరింగ్ తదితర పనులు అవసరమని గుర్తించారు. యూనివర్సిటీ పీజీ కళాశాలలో టాయ్లెట్స్ సక్రమంగా లేవని, వీటి మరమ్మతులు చేపట్టడంతోపాటు పాడైన చోట కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు.
కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరిశీలన..
క్యాంపస్లోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. 36 లక్షల వ్యయంతో కంప్యూటర్ ల్యాబ్ కోసం, స్పోర్ట్స్ బోర్డు సందర్శించారు. అక్కడ బాస్కెట్బాల్, కబడ్డీ, తదితర క్రీడల కోర్టులకు సంబంధించి ప్రతిపాదనలు పరిశీలించారు. జూవాలజీ విభాగం పై అంతస్తులో అసంపూర్తిగాఉన్న భవనం నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. కేయూ ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్లాల్, కె. అనితారెడ్డి, పుల్లూరి సుధాకర్, బి. రమ, ప్రొఫెసర్ మల్లం నవీన్, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 24న ఇంకా పలు విభాగాల్లోని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వాటిలో మార్పులు, చేర్పులు కూడా చేయబోతున్నారు. అనంతరం రిపోర్టును యూనివర్సిటీ అధికారులకు అందజేస్తారు.


