సాక్షిప్రతినిధి, వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం అప్పుడే కసరత్తు మొదలైనట్లు కనిపిస్తోంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2027లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో పొటీ చేసిన ముఖ్య నేతలతోపాటు కొత్తగా తెరపైకి వచ్చే ఆశావహులపైనా పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో పట్టున్న నాయకుల కోసం అన్వేషణ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
2024 ఉప ఎన్నికపై అధ్యయనం...
2024 ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనూ ఆయన 1,22,813 ఓట్లు సాధించి ముందంజలో నిలిచి చివరకు ఎలిమినేషన్ ప్రక్రియలో విజేతగా నిలిచారు. తదనంతర పరిణామాలతో మల్లన్న సొంతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించారు. అయితే.. ఎన్నికల సమయానికి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో? అన్న చర్చ ఉంది. బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్రెడ్డి పోటీచేసి గట్టి పోటీ ఇచ్చారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు 1,04,248 ఓట్లు వచ్చాయి. మల్లన్న తర్వాత చివరివరకు పోటీలో నిలిచిన అభ్యర్థి కూడా రాకేశ్రెడ్డే. దీంతో బీఆర్ఎస్ మరోసారి ఆయనకే అవకాశం ఇస్తుందా? అన్న చర్చకు ఆస్కారం ఉంది. కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో నిలిచారు. కాగా, ప్రధాన పార్టీలు కేవలం సీనియర్ రాజకీయ నాయకుల వైపే కాకుండా విద్యావంతులు, ఉద్యోగ సంఘాల నాయకులు, నిరుద్యోగ ఉద్యమాల్లో పనిచేసిన నేతలు, యువ నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్నికకు ఇంకా సమయం.. అప్పుడే కసరత్తు
ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం 2027 మార్చి వరకు ఉండటంతో, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల సంఘం కూడా ఆరు నెలల ముందే సన్నద్ధం కానున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక, ఓటర్ల నమోదు, నియోజకవర్గాల వారీగా బలాబలాలు, ఉద్యోగులు–నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తదితర అంశాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రాజకీయంగా కీలకమైన ఓటు బ్యాంకు ఉంది. వరంగల్ నగరం, హనుమకొండలో ఉద్యోగులు, విద్యావంతులు, యువత అధికంగా ఉండగా.. మిగిలిన జిల్లాల్లో గ్రామీణ ప్రాంత పట్టభద్రుల ఓటర్లు కీలకంగా మారనున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్ర నాయకులు ఇటీవల ఆ వర్గాలే టార్గెట్ సెమినార్లు, సభలు, సమావేశాలే నిర్వహిస్తుండడం గమనార్హం.
2027 ఎన్నికలపై ముందస్తు
లెక్కలు.. ఇప్పటి నుంచే కసరత్తు..
పట్టభద్రుల ఎన్నికలే టార్గెట్..
బలాబలాలపై బేరీజు..
ఆశావహుల జాబితాపైన ఆరా..
గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు


