డిగ్రీ పాస్‌ అంతంతే! | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ పాస్‌ అంతంతే!

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

డిగ్రీ పాస్‌ అంతంతే!

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒకప్పుడు వార్షిక పరీక్షలు ఉండేవి. సంవత్సరం మొత్తం పాఠాల బోధన, అనంతరం పరీక్షలు నిర్వహించేవారు. అందులో ఉత్తీర్ణత తక్కువగా ఉండేది. ఈ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్‌ విధానంలో ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 మార్కులు ఇంటర్నల్‌, 80 మార్కులకు సెమిస్టర్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చినవి ఇంటర్నల్‌ మార్కులతో కలిపి ఉత్తీర్ణత ప్రకటిస్తున్నారు. అయినా పాస్‌ మార్కులు రావడం లేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండో, మూడవ, నాల్గవ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను ఇటీవల అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతశాతం అంతంత మాత్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఎందుకిలా?

డిగ్రీకోర్సుల్లో సెమిస్టర్‌ సిస్టమ్‌లోనూ మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడానికి పలు కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

● విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరుకాకపోవడం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. కానీ, ఏ కళాశాలలోనూ అమలుచేయడం లేదు.

● ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవారే ఉంటున్నారు. కొందరు కళాశాలలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రైవేట్‌గా ఉపాధి పొందుతుంటారని తెలుస్తోంది.

● ప్రైవేట్‌ కళాశాలల్లోనూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు.

● కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో రాకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ కళాశాలలైతే వి ద్యార్థులకు సరిగ్గా ప్రాక్టికల్స్‌ నిర్వహించడం లేదు. మరోవైపు సెల్‌ఫోన్‌ ప్రభావం కూడా వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదన వినిపిస్తోంది. డిగ్రీ కళాశాలలపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కొరవడిందనేది మరో కారణంగా భావిస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా క్లాస్‌లకు హాజరయ్యేలా, కళాశాలల్లో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడితేనే పరీక్షల్లో ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేయూ పరిధిలో సెమిస్టర్‌ సిస్టమ్‌లోనూ మెరుగుపడని ఫలితాలు

బాలికలదే పై చేయి

నాలుగు సెమిస్టర్‌ పరీక్షల్లో బాయ్స్‌కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సెమిస్టర్‌లో బాలికలు 11,295 మందికిగాను 3,776 మంది (33.43శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. బాయ్స్‌ 14,166 మందికిగాను 3,336 మంది (23.55శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్‌కంటే బాలికదే పైచేయి.

రెండో సెమిస్టర్‌లో బాలికలు 25,603మందికిగాను 10,742మంది ఉత్తీర్ణత (41.96శాతం) సాధించగా, బాయ్స్‌ 24,689 మందికి గాను 5,644మంది (22.86శాతం) పాసయ్యి ఉత్తీర్ణత సాధించారు.

మూడో సెమిస్టర్‌లో బాలికలు 7,834 మందికిగాను 3,591 మంది (45.83శాతం), బాయ్స్‌ 10,452 మందికిగాను 3,400 (32.53శాతం) ఉత్తీర్ణత సాధించారు.

4వ సెమిస్టర్‌లో బాలికలు 19,947మందికిగాను 9,587మంది ఉత్తీర్ణత (48.06శాతం), బాయ్స్‌ 18,086 మందికిగాను 5,032 మంది (27.82శాతమే) ఉత్తీర్ణత సాధించారు.

ఇటీవల విడుదలైన ఫలితాల్లో తేటతెల్లం

నాలుగు సెమిస్టర్లలో బాలికలదే హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement