హన్మకొండ: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ‘ఆత్మ’ సౌజన్యంతో హనుమకొండ జిల్లా స్థాయి రైతు మేళా నిర్వహించారు. ఈ మేళా ముగింపు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భూములు కలిగిన రైతులకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో భూభారతికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలి విడతగా ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూముల సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమలు చేయాలని, పంట మార్పిడి, నీటి యాజమాన్యంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి సారించాలి..
హన్మకొండ చౌరస్తా: రాబోయే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాయకులకు దిశానిర్దేశం చేశారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో సోమవారం డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి అధ్యక్షతన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పీఏసీఎస్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 13 మంది మండల అధ్యక్షులు, 10 డివిజన్ల అధ్యక్షులతో కలిసి రాబోయే రోజుల్లో పారీ క్షేత్రస్థాయి బలోపేతానికి కార్యాచరణ రూపొందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, కడియం శ్రీహరి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ, గ్రేటర్ కమిషనర్ వెంకన్న, వివిధ శాఖల అధికారులు వి.విజయ్చంద్ర, కమలాకర్రెడ్డి, శ్రీనివాస్రావు, వెంకన్న, రాధాకిషన్, నిమ్మ సత్యప్రసాద్రెడ్డి, వేదాంతి, ఆదిరెడ్డి, అవినాష్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ముగిసిన రైతు మేళా


