కాజీపేట అర్బన్: నిట్ వరంగల్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సౌజన్యంతో సైబర్ జాగుర్తా దివస్, సురక్షా కా తిరంగా – మంత్ ఎండ్ చాంపియన్ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు భయం, ఆశ, అత్యవసర భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సైబర్ మోసానికి గురైనట్లు గ్రహిస్తే టోల్ఫ్రీ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిట్ వరంగల్ విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సైబర్ భద్రత పరిశోధనలను చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. సైబర్ నేరాలను నివారించేందుకు త్వరలో నిట్లో సైబర్ సెక్యూరిటీ హకథాన్ నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్ మెహతా, డీసీపీ దార కవిత, నిట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


