డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి
హన్మకొండ చౌరస్తా: క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియపై మండల అధ్యక్షులు, ఇన్చార్జ్లతో జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఈనెల 15వ తేదీలోపు తప్పకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు కూడా కమిటీలలో పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించి, అన్ని వర్గాల కలయికతో కమిటీలను సమతుల్యంగా రూపొందించాలన్నారు. సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ పల్లె శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి, వర్ధన్నపేట ఇన్చార్జ్ కూచన రవళి హాజరయ్యారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, హుజూరాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: ఎంజీఎంలో సీనియర్ ఫార్మసీ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న కె.ఉమాదేవి, కె.సత్యం చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందగట్ల శరత్బాబు ఆధ్వర్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డిని వారు మర్యాపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని, ఫార్మసీ ఆఫీసర్లు మరియమ్మ, సునీత, వెంకటరమణ పాల్గొన్నారు.


