హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్ కో వరంగల్ జోనల్ కార్యాలయం వద్ద, హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జయచందర్, గంగరాజు, శ్రీనివాస్, సతీశ్, రహీం, రాజేశ్, జీవన్, రాజ్ కుమార్, శివ, రమేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ రచించిన ‘బుచ్చిబాబు జీవితం –సాహిత్యం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. విశ్వనాథ సాహిత్యపీఠం వ్యవస్థాపకుడు వెలిశాల కొండల్రావు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత అంపశయ్య నవీన్, తెలుగుభాషా సాంస్కృతికశాఖ అధ్యక్షుడు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, కవులు, రచయితలు దర్బశయనం శ్రీనివాసచార్య, అశోక్కుమార్, నెల్లుట్ల రమాదేవి శశికిరణ్ పాల్గొన్నారు.
హన్మకొండ: ఎంజీఎంలో పని చేస్తూ తొలగింపునకు గురైన 12 మంది ల్యాబ్ టెక్నీషియన్లు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఉద్యోగ సంఘం నాయకుడు సతీశ్ తమ సమస్యలు వివరించారు. 24 ఏళ్లుగా పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని వివరించారు. సమస్యలు విన్న కేటీఆర్ మాట్లాడుతూ ఎంజీఎంలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల తొలగింపు ఈ ప్రభుత్వ మోసపూరిత తనానికి నిదర్శనం అన్నారు. తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. అదేవిధంగా గుణదల లోకో పైలెట్, ట్రైన్ మేనేజర్ల డిపోను మూసేసి వరంగల్లో సెంట్రలైజ్డ్ క్రూ డిపోను ఏర్పాటు చేయించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్కు వినయ్భాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేటీఆర్ త్వరలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి చర్చిస్తానని హామీ ఇచ్చారు.
కేయూ క్యాంపస్ : సామాజిక సంస్కరణ వాది మహాత్మాజ్యోతిరావు పూలే అని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూ బీసీసెల్ డైరెక్టర్ బొడిగ సతీశ్ ఆధ్వర్యంలో శనివారం దూరవిద్యకేంద్రం ప్రాంగణంలో నిర్వహించిన మహాత్మాజ్యోతిరావు జయంతి వేడుకల్లో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు విద్యే ఏకైక సాధనమని నమ్మిన పూలే.. అట్టడుగు వర్గాలకు విద్యను అందించడానికి ఎంతో కృషిచేశారన్నారు. కాగా, తొలుత రిజిస్ట్రార్ రామచంద్రంతోకలిసి మహాత్మాజ్యోతిరావుపూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్డీ వెంకట్రామ్రెడ్డి, పాలకమండలి సభ్యులు అనితారెడ్డి, సురేశ్లాల్, రమ, చిర్రరాజు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజి ప్రిన్సిపాల్ జ్యోతి, కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ నారాయణ, కుర్తా అధ్యక్షుడు సదానందం పాల్గొన్నారు.


