వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ/రామన్నపేట/వరంగల్ చౌరస్తా: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో నాణ్యమైన మందులు ఎంతో కీలకమని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఎవరైనా నాసిరకం మందులు తయారు చేసినా, పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వ ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యలో మందుల నియంత్రణ, నియంత్రణ వ్యవస్థ బలోపేతంపై శనివారం వరంగల్ కొత్తవాడలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మమైదాన్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఔషధ విక్రేతలు ప్లకార్డులు చేతబూని ‘మందులు వద్దు, జీవితం ముద్దు’ డాక్టర్ల సలహాతోనే మందులను వాడండి, లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచే మందులు కొనాలి, నకిలీ మందులు అరికట్టాలి అని నినాదాలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మందులు ఉపయోగించాలని సూచించారు. నకిలీ మందులపై టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ చౌరస్తా నుంచి హెడ్పోస్టాఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, డీపీఆర్ఓ అయూబ్ఖాన్, జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు, వైద్యులు, ఫార్మసిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు.


