క్యాంటీన్ శ్రీదేవిగా ‘ముద్ర’
● పీఎం ముద్ర రుణాలు వినియోగించుకుని వ్యాపారం
● గణతంత్ర వేడుకలకు పీఎం నుంచి అందిన ఆహ్వానం
గొప్ప విజయాలన్ని చిన్న సంకల్పంతోనే మొదలవుతాయనేందుకు నిదర్శనం వరంగల్ జిల్లాకు చెందిన మొగిలి శ్రీదేవి. కష్టకాలంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా అయ్యేందుకు కాలేజీల్లో మొదలైన క్యాంటీన్ల ప్రస్థానం.. ఆ తర్వాత మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజీఎం)లో క్యాంటీన్.. పీఎం ముద్ర రుణాలను పక్కాగా వినియోగించుకుని వ్యాపారిగా మారారు. ఇప్పుడు వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో సీ్త్ర టీ క్యాంటీన్ నిర్వహిస్తూ డిజిటల్ లావాదేవీల నిర్వహణతో ఆర్థిక, సామాజిక పురోగతి సాధించినందుకు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానాన్ని అందుకున్నారు. పదో తరగతి వరకు చదివిన ఆమె తన ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆమె విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..
మాది వరంగల్ నగరంలోని మట్టెవాడ. నా భర్త మొగిలి వెంకటేశ్వర్లు గతంలో పదేళ్లపాటు ఎంజీ ఎం ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. చాలీచాలని జీతంతో కొడుకులు నిఖిల్ కుమార్, అఖిల్ కుమార్ చదువులకు ఇబ్బందిగా మారింది. తొలుత కాలేజీల్లో క్యాంటీన్లు నిర్వహించా. సీకేఎం కాలేజీలో క్యాంటీన్ నిర్వహిస్తున్న సమయంలో అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ మా టీ రుచి చూసి ఎంజీఎం ఆస్పత్రిలో క్యాంటీన్ నిర్వహించుకునేందుకు అనుమతించారు. అలా.. పదేళ్ల పాటు ఎంజీఎంలో క్యాంటీన్ నడిపా. ఈ సమయంలోనే 2016 నుంచి 2017 మధ్య ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా రూ.20 వేలు రుణం తీసుకుని క్యాంటీన్ అవసరాల కోసం ఖర్చు చేశా. ఈ రుణం సకాలంలో తీర్చా.
రూ.4.5 లక్షలతో క్యాంటీన్ ప్రారంభం..
ఎంజీఎం ఓపీకి రద్దీ పెరగడంతో అక్కడ క్యాంటీన్ తొలగించాలన్న కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో సీ్త్ర క్యాంటీన్ ప్రారంభించుకునేందుకు అవకాశమిచ్చారు. 2025 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా నక్కలగుట్ట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) శాఖలో రూపాయి వడ్డీతో రూ.4.5 లక్షల రుణం తీసుకుని వరంగల్ కలెక్టరేట్లో క్యాంటీన్ ప్రారంభించా. పది నెలలుగా స్థిర ఆదాయం వస్తోంది. భర్త వెంకటేశ్వర్లు, ఎంఎల్టీ చదువుతున్న మా చిన్నబాబు అఖిల్ క్యాంటీన్ నిర్వహణలో నాకు సహాయంగా ఉంటున్నారు. ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం కలెక్టరేట్కు వచ్చేవారు నా క్యాంటీన్లో టీ తాగుతుండడంతో వచ్చే ఆదాయంతో వడ్డీని కూడా సమయనుకూలంగా చెల్లించే అవకాశం ఏర్పడింది. ఇలా ప్రభుత్వం నుంచి సహాయం పొంది ఆర్థిక పురోగతి సాధించడంతో జనవరి 26న న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి పిలుపు అందింది. కష్టకాలంలో ప్రభుత్వం అందించిన సా యం నన్ను నిలబెట్టింది. రాష్ట్రంలో ఎంపిక చేసి న ముగ్గురు మహిళ వ్యాపారవేత్తల్లో నేను ఒకదాన్ని కావడం సంతోషంగా ఉంది. విమాన చా ర్జీలు, ఇతర ప్రయాణ ఖర్చులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరిస్తోంది.
– సాక్షి, వరంగల్


