సమగ్రశిక్షలో అధికారి ఇష్టారాజ్యం!
ప్రీప్రైమరీ స్కూళ్ల వస్తువుల
కొనుగోళ్లలోనూ..
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షలో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తన బాధ్యతల పరిధి దాటి జిల్లా విద్యాశాఖ కార్యాలయ వ్యవహారాల్లోనూ దూరిపోతున్నారని, తాను చెప్పినట్లు వింటేనే బిల్లులు పాస్ అవుతాయని, లేదంటే కొర్రీలు పెట్టడంతో ‘మధుసూదనా’ఇది మీకు తగునా.. అంటూ బాధితులు నిట్టూరుస్తున్నారు. సదరు అధికారి ముడుపులు తీసుకోవడంలోనూ చాలా ‘తెలివి’గా వ్యవహరిస్తారన్న టాక్ వినిపిస్తోంది. తను ఎక్కడా ఇరక్కుండా సంబంధిత సిబ్బందిచేత చేయించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి 10 గంటల వరకు సిబ్బంది కార్యాలయంలోనే ఉంచుతూ, తాను బిల్లులు పరిశీలించేవరకు పక్కన నిలబడాల్సి ఉండాలని హుకుం జారీ చేయడం ఈయన ప్రత్యేకత. అంతేగాకుండా తనకు అనుకూలంగా కేజీబీవీలకు సంబంధించిన ఒకరిద్దరి సిబ్బందిని మార్చుకొని వారితో ఇతర కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఈయన వేధింపులు భరించలేక పలువురు బాధితులు డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
డీఈఓకు డీటీఎఫ్ బాధ్యుల ఫిర్యాదు..
హనుమకొండ జిల్లా విద్యాశాఖలోని సమగ్రశిక్షణలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్గా పారిన్ డిప్యుటేషన్పై బాధ్యతలు నిర్వర్తిస్తున్న మధుసూదన్పై పలు ఆరోపణలు చేస్తూ డిసెంబర్ 23న జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్కు డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. మధుసూదన్ తీరుతో కేజీబీవీల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, అకౌంటెంట్ ఉద్యోగినులు తీవ్ర భయం, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నెలవారీగా డైట్ చార్జీలు, ఇతరత్రా బిల్లులు తీసుకొస్తే, వాటిని తాను చెప్పినట్లుగా మార్చాలని ఒత్తిడిచేసి ముడుపులువచ్చేలా పాస్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఫర్నిచర్, క్రీడా సామగ్రి, ల్యాబ్ మెటీరియల్స్, స్టేషనరీ, లైబ్రరీ పుస్తకాలు తదితర ఽవాటివి నిజమైన ధర తెలుసుకోవాల్సిన అవసరం లేదని బెదిరించి ఇష్టం వచ్చిన ధర కోట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఆ అధికారిపై విచారణ కమిటీవేసిన డీఈఓ
ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ మధుసూదన్పై వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో డీఈఓ ఇటీవల విచారణ కమిటీని నియమించారు. సదరు కమిటీ జిల్లాలోని 9 కేజీబీవీల ఎస్ఓలు, అకౌంటెంట్ ఉద్యోగినులను వేర్వేరుగా పిలిపించి విచారణ జరిపారు. తాము ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ నుంచి ఎలాంటి ఇబ్బందులకు గురయ్యామో తెలియజేశారని, లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు సమాచారం. మరికొందరు కమిటీ ముందు కన్నీటిపర్యంతమైనట్లు తెలిసింది. కాగా, అధికారి మధుసూదన్ని విచారణకు రావాలని కమిటీ సమాచారం ఇచ్చినా హాజరుకాలేదని తెలుస్తోంది. ఆయనపై రెండు మూడు రోజుల్లో విచారణ కమిటీ డీఈఓకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
నాపై విచారణ జరపాలంటే కమిటీలో
గెజిటెడ్ ఆఫీసర్లు ఉండాలి
సమగ్రశిక్షలో నేను గెజిటెడ్ ఆఫీసర్ని. నాపై విచారణ జరపాలంటే కమిటీలో గెజిటెడ్ ఆఫీసర్లు అయి ఉండాలి. అదేవిధంగా సమగ్రశిక్షకు సంబంధించిన ఆడిటర్ కూడా ఉండాలి. కానీ కమిటీలో వీరు లేరు. అందుకే హాజరుకాలేదు. ఇదే విషయమై డీఈఓకు లిఖితపూర్వకంగా తెలియజేశా. నేను సమగ్రశిక్షలో, కేజీబీవీల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం.
– జిల్లా సమగ్రశిక్ష ఫైనాన్స్
అకౌంటెంట్ ఆఫీసర్ మధుసూదన్
సమగ్రశిక్షలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ తీరుపై సిబ్బంది ఆవేదన
ఆయన ఎప్పుడు రమ్మంటే సిబ్బంది అప్పుడే కార్యాలయానికి రావాలి
రాత్రివేళ ఆఫీస్లో బిల్లులు
పరిశీలించడం ఈయన ప్రత్యేకత
డీటీఎఫ్ బాధ్యులు, బాధితులు
డీఈఓకు వరుస ఫిర్యాదులు
విచారణ కమిటీ వేసిన డీఈఓ.. మూడు రోజులపాటు కొనసాగిన విచారణ
హనుమకొండ జిల్లా విద్యాశాఖ పరిధిలో 45 ప్రీప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. వాటికి అవసరమైన వస్తువుల కొనుగోలుకు రూ.52.50లక్షల నిధులు మంజూరయ్యాయి. విద్యాశాఖలో సమగ్రశిక్ష కోఆర్డినేటర్ పర్యవేక్షణలోనే టెండర్ పిలిచి వర్క్ఆర్డర్ ఇవ్వాల్సి ఉండగా, ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్.. ఆ కోఆర్డినేటర్కు తెలియజేయకుండానే గత ఇన్చార్జ్ డీఈఓకు చెప్పి వర్క్ ఆర్డర్స్ను టెండర్దారులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. కాగా, వర్క్ ఆర్డర్స్ తన ప్రమేయం లేకుండానే ఇచ్చారని సమగ్రశిక్ష కోఆర్డినేటర్ ఇటీవల వచ్చిన డీఈఓ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. సమగ్రశిక్షలో నలుగురు కోఆర్డినేటర్లు ఉండగా, వీరికి రావాల్సిన టీఏ,డీఏ బిల్లులు కూడా చెల్లించడం లేదని వారే చెబుతుండడం గమనార్హం. ఓ కోఆర్డినేటర్ ఇటీవల బిల్లు పెట్టుకోగా కొర్రీపెట్టి నిలిపివేసినట్లు చెబుతున్నారు.


