
అర్హుల గుర్తింపును వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల అర్హుదారులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గ్రేటర్ 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల గుర్తింపు సర్వేను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధల మేరకు అర్హులను గుర్తించాలని, ప్రతి 200 ఇళ్లకు నియమించిన ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సూచించారు. జాబితాల్లో అనర్హులను తొలగించాలని, ఈనెల 30 వరకు పరిశీలన పూర్తి కావాలన్నారు. భూమి విస్తీర్ణం 60 గజాలకు మించకూడదని, గతంలో బేస్మెంట్, పిల్లర్స్ నిర్మించిన వారు ఇందిరమ్మ పథకానికి అర్హులు కారనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ప్రొసీడింగ్స్ అందిన తర్వాతే ముగ్గు పోసుకుని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ ప్రాజెక్టు అధికారి గణపతి, కార్పొరేటర్ వస్కుల బాబు, ప్రత్యేక అధికారి రమేశ్, రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పశుసంపద దేశానికి వెన్నెముక
వరంగల్: పశుసంపద దేశానికి వెన్నెముక అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో శనివారం ప్రపంచ పశువైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పశుసంపద సంక్షేమం, అభివృద్ధిలో పశువైద్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మూగ జీవులకు సేవచేయడంలో వారి సమయస్ఫూర్తి గొప్పదని కొనియాడారు. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా పశువైద్యాధికారి బాలకృష్ణ, మామునూరు వెటర్నరీ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణ, డాక్టర్ బాలాజీ, డాక్టర్ బీఎన్.రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లు పాల్గొన్నారు.
రైతులతో ఆర్బిట్రేషన్..
జిల్లాలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామ రైతులతో శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద ఆర్బిట్రేషన్ నిర్వహించారు.