
పూడికతీత పనుల్లో వేగం పెంచండి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆశ్విని తానాజీ వాకడే సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడికతీత లక్ష్యం కాగా ఇప్పటి వరకు చెరువులో రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక తీసినట్లు అధికారులు కమిషనర్కు వివరించారు. నిర్దేశిత గడువులోగా పూడికతీత పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ‘కుడా’ ప్రాజెక్టు అధికారి అజిత్రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు.