
అర్ధరాత్రి.. మూగజీవాల మృత్యుఘోష
ఖిలా వరంగల్ : ఆ మూగజీవాలు ప్రమాదమని గుర్తించలేవు. కాపాడండి అని అరవలేవు. మద్యం మత్తులో ఆకతాయిలు చేసిన పనికి అర్ధరాత్రి మాంసంముద్ధలయ్యా యి. వాటినే నమ్ముకున్న ఓ వ్యక్తి కుటుంబం రోడ్డున పడింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరు?.. అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఖిలావరంగల్ మట్టికోట ఎల్పీగండి సమీపాన గొర్రెలు, మేకల ఫామ్లో గురువా రం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 450 గొర్రెలు, మేకలు సజీవ దహనమైన విషయం తెలిసిందే. సుమారు రూ.30లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు బోరున విలపిస్తున్నారు.
ఫామ్ను సందర్శించిన పోలీసులు
అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం ఉదయం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీ నందిరామ్నాయక్తోపాటు పశసంవర్థకశాఖ జేడీ బాలకృష్ణ, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఎంహెచ్ఓ రాజేష్, ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, స్థానిక కార్పొరేటర్ ఉమ సందర్శించారు. మాంసం ముద్దలైన మూగజీవాలను పరిశీలించా రు. బాధితులైన దుగ్గిరాల లక్ష్మణ్, దుగ్గిరాల కుమారీలను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అదుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు.
మొదలైన దర్యాప్తు
గొర్రెల ఫామ్లో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టం మీద బాధితురాలు దుగ్గిరాల కుమారీ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫామ్లో కరెంట్ సరఫరా లేదని, బ్యాటరీ సహాయంతో సీసీ కెమెరాలు పనిచేస్తాయని, అవికూడా మంటల్లో పూర్తి కాలిబూడిదైనట్లు తెలిపింది. ఆంధ్రానుంచి బతుకు దెరువు కోసం వలస వచ్చి.. కోట ప్రాంతంలో స్థలాన్ని లీజుకు తీసుకుని ఫామ్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, శతృవులంటూ ఎవరూ లేరని, మద్యం, గంజాయికి బానిసైన ఆకతాయిలే ఫామ్కు నిప్పు అంటించి ఉంటా రని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
కళేబరాల పూడ్చివేత
బల్దియా అధికారులు పరిసర ప్రాంతాల్లో వ్యాధులు ప్రభలకుండా గొర్రెలు, మేకల కళేబరాలను వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి పూడ్చివేశారు.. అంతకుముందు పశువైద్యులు కళేబరాలనుంచి షాంపిల్స్ సేకరించారు.
లేని ఫైర్ స్టేషన్
ఖిలావరంగల్ మండల పరిధిలో ఫైర్స్టేషన్ లేదు. చుట్టూ పది కిలోమీటర్ల మేర మండలం విస్తరించి ఉంది. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వర్ధన్నపేట, హనుమకొండ, మట్టెవాడ పరిధిలోనుంచి ఫైరింజన్లు రావాలి. ఆ లోగా మంటలు పూర్తిగా అంటుకుని బుగ్గి అవుతోందని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఆకతాయిలు చేసిన పనికి నా కుటుంబం రోడ్డు మీద పడింది. జీవనాధారమైన 450 మూగజీవాలు మంటల్లో మాంసం ముద్దలయ్యాయి. సుమారు రూ.30లక్షల విలువైన గొర్రెలు, మేకల మృతి చెందాయి. ప్రభుత్వమే నా కుటుంబాన్ని ఆదుకోవాలి.
దుగ్గిరాల లక్ష్మణ్, బాధితుడు
గొర్రెలు, మేకల ఫామ్లో వ్యాపించిన మంటలు
సజీవదహనమైన 450 జీవాలు..
సుమారు రూ.30లక్షల నష్టం
ఆకతాయిల పనేనంటున్న బాధితులు
ఘటన స్థలాన్ని సందర్శించిన డీసీపీ సలీమా, ఏసీపీ నందిరాంనాయక్

అర్ధరాత్రి.. మూగజీవాల మృత్యుఘోష