అమరావతి పెనుమాక రహదారిలో ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు వారం తరువాత కేసు నమోదు చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్న కార్మికులు వివరాలు వెల్లడించిన తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు
తాడేపల్లి రూరల్: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై అమానుషంగా మీదపడి దాడిచేసిన ఘటనపై ఆలస్యంగా తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ను పెనుమాక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో డ్రైవర్ తలమల ఏసురాజును పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు ఆపి డ్రైవర్ను విచక్షణా రహితంగా దాడిచేశాడు. జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వీరేంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును విచక్షణా రహితంగా కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్బుక్ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్కు అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు.
గుంటూరు రూరల్: కారు డ్రైవర్ ఓవర్ స్పీడుకు బొలెరో డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఎన్హెచ్ 16లో బుడంపాడు వద్ద ప్రకాశం జిల్లాకు చెందిన పాలకుర్తి వెంకటేశ్వర్లు బొలెరో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో శుక్రవారం విజయవాడ వైపు నుంచి బొలెరో ట్రక్లో బాతుల లోడుతో వెళుతూ బుడంపాడు వద్ద హైవే నుంచి కిందకు దిగుతున్నాడు. అదే క్రమంలో తెనాలి బాలాజీరావుపేటకు చెందిన జల్లి సతీష్ హైవే సమీపంలోని ఆస్పత్రిలోలో ఆరోగ్యం చూపించుకుని హైవే ఎక్కేందుకు తన కారులో వెళుతున్నాడు. కారులో వెళుతూ మితిమీరిన వేగంతో హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగుతున్న బొలెరో ట్రక్ను ఢీకొన్నాడు. బొలెరో ట్రక్ బోల్తాపడగా డ్రైవర్ వెంకటేశ్వర్లు(45) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించి మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


